సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : సంక్రాంతి పండుగ పేరుతో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రైళ్ల ద్వారా రైల్వే శాఖ దోపిడీకి సిద్ధమైంది. పండుగ నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రయాణికులకు ప్రయాణం భారంగా మారింది. దీంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైళ్లలో సాధారణ చార్జీలపై గరిష్ఠంగా 30 శాతం వరకు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కిక్కిరిసి పోతున్న రైళ్లలో చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలతో ప్రయాణాలు చేయలేక, అదనపు చార్జీలు చెల్లించలేక పలు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ క్రమంలో కావాలనే దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నారని, కాని ప్రత్యేక రైళ్లలో సాధారణ చార్జీలు ఎందుకు వసూలు చేయడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్ర యాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బోగీలు ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తులను రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
సంక్రాంతికి 94 రైలు సర్వీసులు..
దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ ప్రకటించిన వివరాల ప్రకారం సంక్రాంతి నేపథ్యంలో జనవరి 1 నుంచి 20 వరకు 94 రైలు సర్వీసులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పైగా ప్రయాణికుల అదనపు సౌకర్యం కోసం ప్రత్యేక రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, వికారాబాద్ నుంచి నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ వైపుగా అధిక సంఖ్యలో రైళ్లను నడుపుతున్నట్లు వివరించారు.