ఎల్బీనగర్, డిసెంబర్ 1: ఎల్బీనగర్ నియోజకవర్గం శాసనసభ ఎన్నికల్లో ఓటింగ్కు సగం మంది ఆసక్తి చూపలేదు. ఈసారి కూడా 50 శాతం లోపే పోలింగ్ జరిగింది. ఎల్బీనగర్ నియోకవర్గంలోని పదకొండు డివిజన్లలోని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో 49.07 శాతంతో 2,91,347 ఓట్లు పోలయ్యాయి. పురుషులు 1,49,827, మహిళలు 1,41,492, ఇతరులు 28 మంది ఓటేశారు. ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానంలో బరిలో ఉన్న 48 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఎల్బీనగర్ నియోజకవర్గం ఓటర్లు తేల్చేశారు.
ఎల్బీనగర్ ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ అభ్యర్థిగా దేవిరెడ్డి సుధీర్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మధుయాష్కీ గౌడ్, బీజేపీ అభ్యర్థిగా సామ రంగారెడ్డితో పాటు మరో 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 5,93,712 మంది ఓటర్లలో తమ నూతన శాసనసభ్యుడిని ఎన్నుకునేందుకు సగానికి తక్కువ మందే ఓట్లు వేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న 11 డివిజన్ల పరిధిలోని 235 ప్రాంతాల్లో 570 పోలీంగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులు (80ప్లస్) కోసం ముందస్తుగానే ఓటింగ్ జరిగింది. ఇలా మొత్తం 421 ఓటర్లు ఉండగా వారిలో 410 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో 50 శాతం లోపే ఎన్నికల పోలింగ్ జరుగుతూ వస్తోంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు తమ ఇతర స్వస్థలాలకు వెళ్లి ఓటింగ్లో పాల్గొంటుండటంతో ఇక్కడ ఓటర్లు లేక 50 శాతానికంటే తక్కువ ఓట్లు నమోదయ్యాయి. తొలి రెండు గంటల్లో ఉదయం 9 గంటలకు 5.6 శాతం, ఉదయం పదకొండు గంటల వరకు 11.18 శాతం, మధ్యాహ్నం 1 గంట వరకు 24.05 శాతం, సాయంత్రం మూడు గంటల వరకు 36.63 శాతం నమోదు కాగా సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి మొత్తంగా 49.07 శాతంతో మొత్తం 2,91,347ఓట్లు పోలయ్యాయి.
ఎల్బీనగర్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. నాటి నుంచి ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. నాలుగు పర్యాయాలు కూడా 50 శాతం లోపే ఓట్లు పోలయ్యాయి. 2009లో 47.38 శాతంతో 1,95,541 ఓట్లు పోల్కాగా, 2014లో 47.36 శాతంతో 2,50,852 ఓట్లు పోలయ్యాయి. 2018లో 49.58 శాతంతో 2,44, 841 పోల్ కాగా తాజాగా 2023 తాజా ఎన్నికల్లో 49.07 శాతంతో మొత్తం పోలైన ఓట్లు 2,91,347 పోల్ అయ్యాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలో వివిధ జిల్లాలకు చెందిన ఓటర్లు చాలా మంది ఉన్నారు. వారు ఓటరు లిస్టుల్లో తమ పేర్లను నమోదుచేయించుకుంటున్నారే తప్ప ఇక్కడ ఓటు వేయకుండా తమ స్వస్థలాలు ఉన్న నియోజకవర్గాలకు తరలిపోతున్నారు. దీంతో ఇక్కడ పోలింగ్ శాతం తగ్గుతోందని తెలుస్తోంది.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎన్నికలు ముగిసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ గెలుపు ఖాయమంటూ ధీమాలు వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి తన గెలుపు ఖాయమని పేర్కొంటున్నారు. విలేకరుల సమావేశం పెట్టి మరీ తన గెలుపు ఖాయమని తెలిపారు. అదే రీతిలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు సైతం తమ గెలుపు ఖాయమని, తమకే ఓటర్లు మద్దతు పలికారని ధీమాతో ఉన్నారు.