మీర్పేట్కు చెందిన ఓ వినియోగదారుడు (క్యాన్ నంబర్తో) ఈ నెల 26న మంచి నీటి ట్యాంకర్ కోసం జలమండలి వినియోగదారుల కేంద్రంకు ఫోన్ చేశాడు. ట్యాంకర్ బుక్ అయినట్లు సెల్ఫోన్కు సందేశం వచ్చింది. వాస్తవానికి 24 గంటల్లో ట్యాంకర్ పంపించాలి. కానీ ట్యాంకర్ రాలేదు.
జూబ్లీహిల్స్కు చెందిన ఓ వినియోగదారుడు క్యాన్ నంబర్తో నీటి ట్యాంకర్ కోసం సంప్రదించాడు. కానీ క్యాన్ నంబర్పై పెండింగ్ బకాయి ఉన్నదని చూపించింది. ఆ ఫీజు చెల్లించారు. అయితే అప్డేట్ అవ్వడానికి మరో 24 గంటల సమయం పడుతుందని సందేశం వచ్చింది. దీంతో మళ్లీ ట్యాంకర్ బుక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్ని రోజులకు ట్యాంకర్ వస్తుందో కూడా తెలియని దుస్థితి జలమండలిలో నెలకొంది.
GHMC | సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : పదేండ్ల తర్వాత గ్రేటర్ వాసులు గుక్కెడు నీటికోసం అల్లాడిపోతున్నారు. కేసీఆర్ హయాంలో.. పదేండ్ల కాలంలో ఏ రోజూ రాని నీటి సమస్య.. కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన మూడు నెలల్లోనే కరువు కోరలు చాస్తున్నది. మళ్లీ ఖాళీ బిందెలు చేతపట్టి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది.
కండ్లముందు నీటి కష్టాలు కనిపిస్తున్నా జలమండలి అధికారులు ప్రత్నామ్యాయ చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారానికో మారు అరకొరగా నీటి సరఫరా జరుగుతుండగా, ట్యాంకర్ల ద్వారా సైతం సరఫరా కాకపోవడంతో కాలనీల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మార్చి నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందోనని తలుచుకుంటేనే భయం వేస్తున్నదని మహిళలు వాపోతున్నారు. పదేండ్లుగా మూలన పడేసిన డ్రమ్ములను మళ్లీ తీయాల్సి వచ్చిందని తెలుపుతున్నారు.
రాజేంద్రనగర్లో భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో బోర్లు పూర్తి స్థాయిలో ఎండిపోతున్నాయి. నల్లాల ద్వారా వచ్చే నీరు సరిపడా రాకపోవడంతో ట్యాకర్లపై ఆధారపడుతున్నారు. ఎండలు పెరిగినాకొద్ది రోజురోజుకు బుకింగ్ల సంఖ్య పెరిగిపోతుందని, ట్యాంకర్ బుకింగ్ చేసిన రెండు రోజులకు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్నగర్, హెచ్ఎఫ్నగర్, కార్మికనగర్, ఎస్పీఆర్ హిల్స్లో కన్నీటి కష్టాలు తప్పేలా లేవు. అరకొర నీటి సరఫరాకు తోడు లోప్రెషర్, కలుషిత జలాలలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రహ్మత్నగర్, బోరబండ డివిజన్లలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ఎస్పీఆర్ హిల్స్లో రూ.11కోట్ల వ్యయంతో రిజర్వాయర్ నిర్మాణానికి సంకల్పించింది. ఈ పనులను శుక్రవారం రహ్మత్నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి జలమండలి అధికారులతో కలిసి పరిశీలించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అన్ని సెక్షన్లలో ప్రజలు నీటి కోసం అల్లాడిపోతున్నారు. జలమండలి కార్యాలయానికి చెందిన వాటర్ ట్యాంకర్లను బుక్ చేసుకునే వారి సంఖ్య రెట్టింపు అయ్యింది. శేరిలింగంపల్లిలో మొత్తం 11 సెక్షన్లు ఉండగా వాటిలో 45 నుంచి 47 ఎంజీడీల నీరు అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అధికంగా గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ నుంచి ట్యాంకర్ల బుకింగ్లు ఉన్నట్లు తెలిపారు. వాటర్ ట్యాంకర్లను బుక్ చేసుకునే వారి సంఖ్య పెరగడంతో రెండు నుంచి మూడు రోజులు సమయం పడుతుంది. ఒక్కో ట్యాంకరుకు రూ.600 నుంచి 1500 వరకు అక్రమ నీటి వ్యాపారులు వసూళ్లు చేస్తున్నారు.
మాదాపూర్లోని సున్నం చెరువులో అక్రమంగా బోర్లను వేసి ఇష్టానుసారంగా నీటివ్యాపారం చేస్తున్నారు. 20 నుంచి 30 వాటర్ ట్యాంకర్ల ద్వారా నిరంతరాయంగా నీటి సరఫరా జరుగుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. అదేవిధంగా గచ్చిబౌలి, నలగండ్ల, గోపన్పల్లి, గౌలిదొడ్డి, ఖాజగూడ, మజీద్బండా పరిసర ప్రాంతాల్లో అక్రమ నీటి వ్యాపారులు రాత్రిపగలు తేడాలేకుండా నీటిని తోడేస్తున్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చేతి పంపులను బాగుచేస్తున్నాం
కూకట్పల్లి జలమండలి పరిధిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అదనంగా రెండు ఎంజీడీల నీటిని కలుపుకుని 30 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నాం. అవసరమైన చోట చేతి పంపులను బాగుచేయడం, పవర్ బోరువెల్స్ వద్ద సమస్యలు పరిష్కరించడం, లో ప్రెషర్, లీకేజీ సమస్యలున్న ప్రాంతాలపై దృష్టిపెట్టి ప్రత్యేక మరమ్మతు పనులు చేశాం. తాగునీటి ట్యాంకర్ల కోసం డిమాండ్ పెరగడంతో అందరికీ నీటిని అందించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరుతున్నాం.
– అంబటి ప్రభాకర్రావు, జీఎం, కూకట్పల్లి
వేసవిలో నీటి అవసరాలు ఎక్కువగా ఉంటాయి. నీటిని పొదుపుగా వాడుకోవాలి. రోజుకు 35 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న 4 ట్యాంకర్లకు తోడు అదనంగా మరో 3 ట్యాంకర్లను తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఆటోనగర్లో ట్యాంకర్ ఫిల్లింగ్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. అవసరమైతే వనస్థలిపురంలోనూ ట్యాంకర్ల ఫిల్లింగ్ను ప్రారంభిస్తాం.
– శ్రీనివాస్రెడ్డి, జలమండలి 10బి జనరల్ మేనేజర్, ఎల్బీనగర్
కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటడంతో మూడు నెలల్లోనే వందలాది బోరుబావులు ఎండిపోయాయి. దీంతో జలమండలి ట్యాంకర్లు, ప్రైవేట్ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం రోజుకు 650 నుంచి 700 ట్యాంకర్ల నీటికోసం ప్రజలు ఆన్లైన్లో బుకింగ్ చేస్తుండగా వారికి తాగునీటిని అందించేందుకు 48గంటల నుంచి నాలుగు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు కాలనీలు జలమండలి సరఫరా చేసే నీటిపైనే ఆదారపడుతున్నాయి. వేసవికాలం కావడంతో మంచినీటి కోసం డిమాండ్ పెరుగుతున్నది. భూగర్భ జలాలు అడుగంటడంతో ఇండ్లలోని బోరుబావులు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో ప్రజలు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రతిరోజు సుమారు 120 నుంచి 150 ట్యాంకర్ల వరకు సరఫరా చేస్తున్నారు.
మలక్పేట్ నియోజకవర్గంలో 15వేల మంది సింగరేణి గుడిసెల వాసులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే అరకొర తాగునీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్ల ముందు డ్రమ్ములు పెట్టుకొని ట్యాంకర్లు ఎప్పుడువస్తాయోనని ఎదరుచూస్తూ.. ట్యాంకర్లతో పోసే నీటితోనే తమ అవసరాలు తీర్చుకుంటున్నారు.
వేసవి ప్రారంభంలోనే ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో నీటి కష్టాలు తీవ్రంగా మారాయి. వారానికోమారు నల్లాల ద్వారా అరకొరగా నీటి సరఫరా జరుగుతుండగా, ట్యాంకర్లు బుకింగ్ చేసుకున్నా రావడానికి తీవ్ర జాప్యం జరుగుతుందని వాపోతున్నారు. ముఖ్యంగా జలమండలి డివిజన్ -6 పరిధిలోకి వచ్చే రహ్మత్నగర్, యూసుఫ్గూడ, వెంగళరావునగర్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ డివిజన్ల పరిధిలో మంచినీటి కష్టాలు తీవ్రంగా మారాయి.
దీంతో రహ్మత్నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్ వాసులు ఎస్ఆర్నగర్లోని జలమండలి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. బంజారాహిల్స్ సబ్ డివిజన్ పరిధిలోని బంజారాహిల్స్, తట్టిఖానా సెక్షన్ల పరిధిలో ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రోజుకు సుమారు 900 నుంచి వెయ్యి ట్యాంకర్లు కావాలంటూ ఆర్డర్లు వస్తుండగా కేవలం 600 నుంచి 700 ట్యాంకర్లను మాత్రమే పంపించగలుగుతున్నారు. డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేయలేక జలమండలి అధికారులు చేతులెత్తేస్తున్నారు.
వేసవి మొదట్లోనే.. మహా నగరం గొంతెండుతోంది. తాగునీటి కోసం తండ్లాడుతోంది. ఎండలు మండిపోతుండటంతో సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. నిర్వహణ లోపాలతోనే ఈ పరిస్థితి నెలకొన్నది. ప్రజా అవసరాలకు అనుగుణంగా సరఫరా లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. వారానికోమారు కూడా నీటి సరఫరా జరగడం లేదని ధ్రువపడింది.
బస్తీలు, కాలనీలకు అరకొర నీటి సరఫరా, కలుషిత జలాల సరఫరా తదితర సమస్యలు కళ్లకు కట్టాయి. సరఫరా.. డిమాండ్కు పొంతన కుదరడంలేదు. గ్రేటర్లో వేలాది బోరుబావులు అడుగంటి పోవడంతో అపార్ట్మెంట్ల వాసులు నీటికోసం చుక్కలు చూస్తున్నారు. ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోవడంతో బుకింగ్ చేసిన వారం రోజులకు సైతం రావడంలేదు. దీంతో విసిగివేసారిన ప్రజలు జలమండలి కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగుతున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న అక్రమార్కులు నీటి కష్టాలను సొమ్ము చేసుకుంటున్నారు.