హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న పట్టణ జనాభా, అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. పట్టణాలు, నగరాల్లో సమ్మిళితమైన సమీకృత అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది. దేశంలో అత్యంత వేగంగా పట్టణ జనాభా పెరుగుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందున్నది.
ఉపాధి, విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం వలసలు పెరుగుతున్నాయి. త్వరలో రాష్ట్ర జనాభాలో 50 శాతం పట్టణాల్లోనే ఉంటుందని అంచనా. అందుకు అనుగుణంగా ప్రజలకు మౌలిక సదుపాయాలు, వసతులు కల్పిస్తున్నది. ఇందులో భాగంగా పట్టణాలు, నగరాల్లో వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 50 వేల జనాభా ఉన్న పట్టణాల్లో రెండు వార్డులకు కలిపి ఒక అధికారి, 50 వేలకు పైగా జనాభా ఉన్నచోట వార్డుకు ఒక అధికారిని నియమించడానికి కసరత్తు చేస్తున్నది.
కనీస వసతులైన తాగునీరు, ఫ్లైఓవర్లు, పారిశుద్ధ్యం, రోడ్లు, వైద్య, విద్య, విద్యుత్తు సౌకర్యాలను మెరుగుపరుస్తున్నది. వీటి కోసం రూ.కోట్ల నిధులను వెచ్చిస్తున్నది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో అధికారుల బృందం పట్టణాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలను 69 నుంచి 142కు పెంచారు. వీటి వాటా రాష్ట్ర జీడీపీలో మూడింట రెండు వంతులుగా ఉన్నది.
గ్రేటర్ హైదరాబాద్ శివారులోని పది మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీతో అనుసంధానం చేయటానికి 104 కారిడార్లలో రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులను మంజూరు చేసింది. జీవన నాణ్యత సూచికలో దేశంలోనే అత్యుత్తమ నగరంగా నిలిచిన హైదరాబాద్ను.. ప్రపంచంలోని 30 ఉత్తమ నగరాల్లో చేర్చటానికి తెలంగాణ సర్కారు తీవ్రంగా కృషి చేస్తున్నది. నివాస నగరంగా, కమర్షియల్ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్గా నిలిచిన రాజధానికి మరింత అభివృద్ధి చేస్తున్నది. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఎస్ఆర్డీపీ కింద రూ. 671.19 కోట్లు, సీఆర్ఎంపీ కింద రూ. 293.93 కోట్లు, హెచ్ఆర్డీసీఎల్ కింద రూ. 114.97 కోట్లతో మౌలిక వసతులు పూర్తి చేసింది. ఎస్ఎన్డీపీ కింద రూ.735 కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో 37 పనులు, రూ.231 కోట్లతో శివారు మున్సిపాలిటీల్లో 21 పనులు చేపట్టింది.
సంక్రాంతి కల్లా వంద శాతం మురుగు నీటి వ్యర్థాలను శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ దేశంలోనే గుర్తింపు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుత సామర్థ్యం 772 ఎంఎల్డీ నుండి 2,029 ఎంఎల్డీకి పెంచడానికి, వ్యర్థాలను 100 శాతం శుద్ధి చేసేలా 31 ఎస్టీపీల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఫేజ్-1లో 883 ఎంఎల్డీ సామర్థ్యంతో 14 ఎస్టీపీల పనులు ప్రారంభించారు. క్యాపిటల్ ఇంటెన్సివ్ పనులను చేపట్టేందుకు జీహెచ్ఎంసీ రూ.5,983 కోట్ల విలువైన రుణాలను పొందింది. జీహెచ్ఎంసీ తన సొంత వనరులతో రూ.8,965 కోట్ల విలువైన పనులను చేపడుతున్నది. అటు.. జవహర్నగర్ కార్పొరేషన్లో ప్రస్తుతం ఉన్న 19.8 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ సామర్థ్యాన్ని ప్రభుత్వం 48 మెగావాట్లకు పెంచుతున్నది. దుండిగల్లో 14.5 మెగావాట్ల కొత్త డబ్ల్యూటీఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నది.