ఎర్రగడ్డ, ఏప్రిల్ 21: సుమారు యాభై ఏండ్ల క్రితం ఖమ్మం జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. పదవీ విరమణ కూడా చేశారు. ప్రస్తుతం 64 ఏండ్ల వయసు వచ్చినప్పటికీ యాభై ఏండ్ల క్రితం తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువును వారు మర్చిపోలేదు. సోమవారం ఆ గురు శిష్యుల ఆత్మీయ కలయిక చోటు చేసుకుంది.
గురువు పేరు కృష్ణశర్మ.. 87 ఏండ్ల వయసున్న శర్మ కుటుంబం ఎర్రగడ్డ డివిజన్ రాజీవ్ నగర్ కాలనీలో ఉంటోంది. ఈయన శిష్యులైన ఎ.కృష్ణమోహన్, ఎం.కృష్ణయ్య, జి.సురేందర్ బాబు, రామరావు సోమవారం కృష్ణశర్మ నివాసానికి వెళ్లి తమ గురువును ఆప్యాయతగా పలకరించి ఘన సన్మానం చేశారు. కాగా.. శర్మ యాభై ఏండ్ల క్రితం ఖమ్మం జిల్లాలోని 6 ప్రభుత్వోన్నత పాఠశాలల్లో హెచ్ఎం గా పనిచేశారు. ఆ తర్వాత పదోన్నతి పొంది విద్యా శాఖలో అధికారిగా విధులు నిర్వహించారు. అనంతరం 1996లో పదవీ విరమణ చేశారు.