ఎర్రగడ్డ, జూన్ 28: మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు చేయూతనిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్కు చెందిన ఆరుగురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ మహిళలకు అనేక పథకాలను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
మన పథకాలను ఇప్పుడిప్పుడే కొన్ని ఇతర రాష్ర్టాలు అనుసరిస్తుండటం గర్వకారణమన్నారు. అన్ని విధాలా వెనుకబడ్డ ఎర్రగడ్డ డివిజన్కు ప్రభుత్వ పథకాల విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. అదే విధంగా అభివృద్ధి విషయంలో కూడా నిధుల కేటాయింపునకు ఏనాడూ జాప్యం జరగలేదని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మహ్మద్షరీఫ్, డివిజన్ అధ్యక్షుడు సంజీవ, అజీమ్, రసూల్, శ్రావణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
10 వేల మంది నమాజు చేసుకునేలా ఈద్గా..
వెంగళరావునగర్, జూన్ 28: ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఈద్గాలో ఒకేసారి 10 వేల మంది మస్లింలు నమాజు చేసుకునేలా ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బుధవారం ఈద్గా ఏర్పాట్లను మున్సిపల్ అధికారులు, ముస్లిం మత పెద్దలతో కలిసి స్వయంగా ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ రూ.9.60 లక్షల వ్యయంతో రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్స్లో ఒకే సారి 10 వేల మంది సమాజు చేసుకునే విధంగా ఈద్గాను తీర్చిదిద్దామన్నారు.
బక్రీద్ పండుగ రోజున నమాజు చేసుకునేలా ముస్లింల కోసం టెంట్లు, ఉజూకు కావాల్సిన నీరు, తాగునీటితో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పూర్తి చేశామన్నారు. గతంలో బక్రీద్, రంజాన్ పండుగల నమాజ్ చేసుకోవాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని..ఇప్పడు ఆ పరిస్థితి లేదన్నారు. నియోజకవర్గంలోని ముస్లిం సోదరులంతా కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ఈద్గాలో సమాజులు చేసుకోవాలని సూచించారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చస్తుందన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ రాజ్కుమార్, కార్పొరేటర్లు సీఎన్రెడ్డి,రాజ్కుమార్ పటేల్, దేదీప్య రావు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ, అప్పుఖాన్, సంతోష్, కృష్ణమోహన్, నాయకులు విజయ్కుమార్, తన్నుఖాన్, నజీర్, బషీర్,సిరాజ్, నర్సింగ్దాస షరీఫ్, గని జబ్బార్, చోటు తదితరులు పాల్గొన్నారు.
వ్యర్థాల సేకరణకు కవర్ల పంపిణీ
జూబ్లీహిల్స్,జూన్28 ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే బక్రీద్ పండుగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రహ్మత్నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. జీవ వ్యర్థాల నిర్వహణకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు కవర్లు పంపిణీ చేశారు. యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్ డివిజన్లోని ముస్లిం ప్రతినిధులకు కవర్లు అందజేశారు. మసీదు కమిటీలతో పాటు ప్రతి ఇంటికి కవర్లు అందేలా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. జీవ వ్యర్థాలను రోడ్లపై పడవేయవద్దని విజ్ఞప్తి చేశారు.