మత్స్యకారుల ఆర్థికాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక పద్ధతులతో చేపల చెరువుల నిర్మాణం, చేప పిల్లల పెంపకం, రంగు చేపల ఉత్పత్తి, వ్యాధుల నివారణ, ఇతర ఉత్పత్తుల తయారీపై శిక్షణకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఆసక్తి గల వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు అత్యాధునిక సదుపాయాలతో మేడ్చల్లో మత్స్య సాంకేతిక శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 5.8 ఎకరాల విస్తీర్ణంలో రూ. 6కోట్లతో ప్రభుత్వం మత్య్స సాంకేతిక శిక్షణ సంస్థ భవన నిర్మాణ పనులను చేపట్టింది. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తి కావడంతో వచ్చే నెలలో ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ల్యాబ్, ఆడిటోరియంతో పాటు ప్రత్యేక వసతులు ఉన్న ఈ భవనంలో రాష్ట్రవ్యాప్తంగా చేపల పెంపకం చేపట్టాలనుకునే వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు మత్య్స శాఖ జిల్లా అధికారి పూర్ణిమ తెలిపారు.
– మేడ్చల్, మే13 (నమస్తే తెలంగాణ)
మేడ్చల్, మే13(నమస్తే తెలంగాణ): మత్స్య కారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్మిస్తున్న మత్స్య సాంకేతిక శిక్షణ సంస్థ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్లో 5 ఎకరాల 8 గుంటల విస్తీర్ణంలో రూ.6 కోట్లతో ప్రభుత్వం శిక్షణ సంస్థ భవన నిర్మాణ పనులను చేపట్టింది. ఈ భవనాన్ని మత్స్యకారులు, మత్స్యశాఖ ఉద్యోగుల శిక్షణ తరగతుల నిర్వహణకు వినియోగించనున్నారు. 95 శాతం పనులు పూర్తి కావడంతో వచ్చే నెలలో ప్రారంభించి అందుబాటులోకి తీసుకురానున్నారు.
మత్స్యకారులు ఆధునిక పద్ధతుల ద్వారా మత్స్య సంపదను పెంచుకునే విధంగా ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలను అందించనుంది. చేపల చెరువుల నిర్మాణాలు, చేప పిల్లల ఉత్పత్తి, పెంపకం, రంగు చేపల ఉత్పత్తి, చేపల వ్యాధుల నివారణ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ఇళ్లలో అక్వేరియంలో పెంచే చేపలు పర్యావరణ అనుకూల పెంపకం పద్ధతులపై శిక్షణ తరగతులను కొనసాగిస్తారు. దీంతో పాటు మత్స్య సహకార సంఘాల నిర్వహణపై అవగాహన కల్పించే విధంగా మత్స్యశాఖ చర్యలు తీసుకుంటున్నది. మత్స్య సంపదకు తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు అనుకూలంగా ఉన్న దృష్ట్యా మత్స్య సంపదను పెంచి మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
వచ్చే నెలలో అందుబాటులోకి
మత్స్య సాంకేతిక శిక్షణ సంస్థ భవనం వచ్చే నెలలోకి అందుబాటులోకి వస్తుంది. శిక్షణ సంస్థ భవనం 95 శాతం పనులు పూర్తయ్యాయి. ఇందులో ల్యాబ్లు, ఆడిటోరియాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకు సాంకేతిక శిక్షణ తరగతులు నిర్వహించి మత్స్య సంపద పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తున్నది.
-పూర్ణిమ, జిల్లా మత్స్యశాఖ అధికారి