మన్సూరాబాద్, ఫిబ్రవరి 26: రద్దీగా ఉన్న బస్సుల్లో ప్రయాణిస్తూ బంగారు ఆభరణాలను దోచుకుంటున్న ఓ పాత నేరస్తుడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 2 లక్షల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఐ ఉపేందర్రావు కథనం ప్రకారం.. సికింద్రాబాద్, తుకారంగేటు, మంగరిబస్తీకి చెందిన లోండె రాహుల్ అలియాస్ రాహుల్ (22) వృత్తిరీత్యా బ్యాండ్ మాస్టర్. రాహుల్ తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల క్రితం చనిపోవడంతో ఇద్దరు చెల్లెలు, తమ్ముడిని పోషిస్తున్నాడు.
బ్యాండు మాస్టర్గా పని చేసిన డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. తుకారంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో హత్యాయత్నం కేసులో అరస్టై జైలుకు వెళ్లి కొన్ని నెలల క్రితం విడుదలయ్యాడు. అనంతరం హబీబ్నగర్ పీఎస్ పరిధిలో సెల్ఫోన్ దొంగతనం చేసిన కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చాడు. జైలు నుంచి వచ్చిన అనంతరం మల్లేపల్లి, అఫ్జల్సాగర్, మంగరిబస్తీలో నివాసముండే తన చెల్లి వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో నివాసముండే సద్దామ్, ఖుద్దూస్, బైరీ రోషన్, అక్రమ్, సల్మాన్, సత్యం, విజయ్, అనిల్సాగర్తో పరిచయం ఏర్పడింది. వీరితో కలిసి రాహుల్ రద్దీగా ఉన్న బస్సుల్లో ప్రయాణిస్తాడు. మెడలో బంగారు చైన్ ఉన్న వ్యక్తులను గమనించి నిందితులందరూ కలిసి అతడిని చుట్టుముట్టి గొలుసును అపహరించి బస్సులో నుంచి దిగి పారిపోతారు.
కాగా కొత్తపేట, బాలాజీనగర్కు చెందిన ఏ. సతీశ్కుమార్ ప్రైవేటు ఉద్యోగి. ఈ నెల 23న ఉప్పల్లో బస్సు ఎక్కి నాగోల్ చౌరస్తాలో దిగాడు. కొద్దిసేపటి అనంతరం తన మెడలోని 2 తులాల బంగారు గొలుసు అపహరణకు గురైనట్లు గుర్తించి ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ కెమెరాలతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ను సేకరించి దర్యాప్తు చేపట్టారు. దొంగలించిన బంగారు ఆభరణాలను శనివారం సికింద్రాబాద్, పాట్ మార్కెట్లోని అన్నపూర్ణ జువెల్లరీ షాపులో నిందితుడైన రాహుల్ అమ్మేందుకు యత్నిస్తుండగా ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాహుల్ ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో 3 దొంగతనాలు, మేడిపల్లి పీఎస్ పరిధిలో ఒక దొంగతనం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని రిమాండ్కు తరలించారు.