దుండిగల్, జూలై 28: అనాథ ఆశ్రమంలో ఆరో తరగతి చదువుతున్న బాలిక అనుమానాస్పద స్థితిలోమృతి చెందింది. దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక కిటికీ గ్రిల్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు పేర్కొంటుండగా, బంధువులు, విద్యార్థి సంఘాల నేతలు మాత్రం మృతురాలి ఒంటిపై గాయాలు ఉన్నాయని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
పోలీసులు, బాలిక బంధువుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నాగరాజు, సరోజన దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. ఐదేండ్ల కిందట నాగరాజు అనారోగ్యంతో చనిపోయాడు. సరోజన తన ముగ్గురు కూతుళ్లను దుండిగల్ పరిధిలోని ‘స్ఫూర్తి ఫౌండేషన్ ఆర్ఫాన్ హౌజ్’లో చేర్పించింది. అనంతరం బతుకుదెరువు కోసం సరోజన కువైట్కు వెళ్లింది. ముగ్గురు పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. ఈ క్రమంలో 6వ తరగతి చదువుతున్న రెండో బాలిక పావనీ బుధవారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, బాలిక మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ప్రతినిధులతో పాటు బాలిక సంరక్షకులు, బంధువులు గురువారం సాయంత్రం స్పూర్తి ఫౌండేషన్ ఆర్ఫాన్ హౌజ్ వద్ద ఆందోళనకు దిగారు.