Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో గ్రేటర్లోని ముఖ్యమైన కూడళ్లను అందంగా ముస్తాబు చేస్తున్నారు. విదేశీ తరహాలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పాదచారుల భద్రతతో పాటు సులభంగా వెళ్లడం, వాహనవేగం తగ్గడం, ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో జంక్షన్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు 13 ప్రదేశాల్లో రూ. 33 కోట్ల అంచనా వ్యయంతో ట్రాఫిక్ జంక్షన్లను ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఆయా కూడళ్ల అభివృద్ధికి టెండర్లను ఆహ్వానించారు. ఈ వేసవి చివరి నాటికల్లా నగరవాసులకు జంక్షన్లను సరికొత్తగా పరిచయం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.