సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : ఆస్తిపన్ను బకాయిదారులపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మరో తొమ్మిది రోజుల్లో ముగుస్తున్నందున సర్కిళ్ల వారీగా మొండి బకాయిదారులను గుర్తించి వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. రూ. 2 వేల కోట్ల నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించడంలో భాగంగా ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో బకాయిదారుల భరతం పడుతున్నారు. ఇందులో భాగంగానే నోటీసులకు స్పందించని వ్యాపార సముదాయాలను సీజ్ చేస్తున్నారు.
గడిచిన వారం రోజులుగా ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే 18 లక్షల మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఉండగా, 75 శాతం మేర ఇప్పటికే వసూళ్లను రాబట్టామని, మిగిలిన 25 శాతం మంది బకాయిదారులకు రెడ్ నోటీసులిచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ నెల 21వ తేదీ వరకు రూ. 1562.03 కోట్ల మేర ఆస్తిపన్ను వసూలైందని, వచ్చే తొమ్మిది రోజుల పాటు ఆరు జోన్ల పరిధిలో రూ. 437.96 కోట్ల ఆస్తిపన్ను వసూళ్లే లక్ష్యంగా పనిచేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.