సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ ) : చెరువుల రక్షణలోనే కాదు…సుందరీకరణ పనుల్లోనూ జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం చూపుతున్నది. చెరువుల పరిరక్షణే ధ్యేయంగా ‘హైడ్రా’ విభాగాన్ని ఏర్పాటు చేశామని ఒక వైపు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో చెరువుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేక కబ్జాదారులకు కొందరు అధికారులు వంత పాడుతున్నారు.
చేతిలో ఉన్న నిధులతో పరిరక్షణ.. సుందరీకరణ పనులు చేపట్టి మినీ పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దాల్సిన అధికారులు.. గడిచిన ఏడు నెలలుగా పనులపై పురోగతి చూపించడం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 185 చెరువులను కాపాడి పరిసరాలను అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాల్సిన బల్దియా.. సుందరీకరణ పనులను అటకెక్కించింది.
చుట్టూ బండ్, వాకింగ్ ట్రాక్లు, ల్యాండ్ స్కేపింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా మురుగునీరు చెరువుల్లోకి చేరుతుండటంతో దుర్వాసన వస్తున్నది. ఈ నేపథ్యంలో చెరువు సుందరీకరణ పనులు నిలిచిపోవడంపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
గత కేసీఆర్ సర్కారు జీహెచ్ఎంసీ పరిధిలో తొలి విడతగా 20 చెరువుల సుందరీకరణ పనులను రూ. 271.33 కోట్లతో చేపట్టింది. అయితే కొత్త ప్రభుత్వం వచ్చాక..గడిచిన ఏడు నెలలుగా చెరువుల సుందరీకరణ పనులు ఏ మాత్రం ముందుకు కదలడం లేదు.