2వేల కోట్ల ఆస్తిపన్ను లక్ష్యాన్ని అధిగమించేందుకు బల్దియా చర్య లు చేపట్టింది. మొండి బకాయిదారులను గుర్తించి.. నోటీసులు జారీ చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో 9 లక్షల మంది నుంచి 950 కోట్లను వసూలు చేసింది. అయితే నిర్దేశిత టార్గెట్ చేరుకునేందుకు బకాయిదారులపై దృష్టి సారించింది.
సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఆస్తిపన్ను బకాయిదారులపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. 30 సర్కిళ్లలో మొండి బకాయిదారులను గుర్తించి వారికి నిర్ణీత గడువు వ్యవధితో నోటీసులు జారీ చేస్తున్నది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 2వేల కోట్ల ఆస్తిపన్ను వసూలు లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. ఎర్లీబర్డ్ స్కీం ద్వారా రికార్డు స్థాయిలో రూ. 786.75కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇందులో భాగంగానే వ్యాపారస్తులతో పాటు కేంద్ర, ప్రభుత్వ రంగ సంస్థ బకాయిదారులపై దృష్టి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు సుమారు రూ.5,560 కోట్లు, కేంద్ర బకాయిలు రూ.371 కోట్లు కలిపి మొత్తం రూ. 5,935 కోట్ల బకాయి ఉంది. ఈ మేరకు గడిచిన రెండు నెలలుగా ప్రభుత్వ భవనాల నుంచి రావాల్సిన బకాయిలపై నోటీసులు జారీ చేస్తూ వసూళ్లను రాబడుతున్నారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి దాదాపు రూ. 65కోట్ల మేర బకాయిలను రాబట్టారు. మొత్తంగా ఏప్రిల్ నుంచి జూలై 12 నాటికి 9 లక్షల మంది నుంచి రూ. 950 కోట్ల మేర ఆస్తిపన్ను వసూలు అయ్యిందని అధికారులు పేర్కొన్నారు. రూ. 2వేల కోట్ల టార్గెట్ను అధిగమించడమే లక్ష్యంగా బకాయిదారులపై దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు.