హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలి.. అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా నిలపాలి.. తెలుగు రాష్ర్టాలకు గుండెకాయ వంటి నగరాన్ని దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే అగ్రస్థానంలో నిలపాలనే కల చెదిరిపోయింది. ఒకప్పుడు నగర పాలికగా ఉన్న హైదరాబాద్ను గ్రేటర్గా మలిచిన కాంగ్రెస్ పార్టీ… ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా మూడు ముక్కలు చేసి.. విశ్వనగరం ఆకాంక్షను నిర్వీర్యం చేసింది. శివారు మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేసే క్రమంలో గ్లోబల్ సిటీగా, దేశంలోని అతిపెద్ద మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామంటూ బీరాలు పోయిన సీఎం రేవంత్ ఉన్నది విచ్ఛిన్నం చేసి అభివృద్ధికి అడ్డుకట్ట వేశారు. పాలన సౌలభ్యం కోసమే మూడు కార్పొరేషన్లు అంటూ గ్లోబల్ హబ్ ఆశలను చిన్నాభిన్నం చేశారు. మెరుగైన మౌలిక వసతులు, ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాల్లో వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన నగరానికి రూపురేఖలు లేకుండా చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : చారిత్రక నగరాన్ని ప్రపంచ స్థాయి కేంద్రంగా మలచాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ సర్కారు పదేండ్లలో అనేక విప్లవాత్మక విధానాలను అమలు చేసింది. మెగా ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించి, నగరాన్ని పెట్టుబడుల కేంద్రంగా మలిచింది. ఐటీ, ఫార్మా, స్టార్టప్ హబ్గా మరింత బలోపేతం చేయడానికి మౌలిక వసతులకు పెద్దపీట వేసింది. ఈ క్రమంలో ఎస్ఆర్డీపీ పేరిట ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, నాలాల అభివృద్ధి, మల్టీ లెవల్ పార్కింగ్ హబ్లు, ఐటీ కారిడార్ల విస్తరణ, నగరానికి వన్నె తీసుకువచ్చేలా ఆకాశహర్మ్యాలకు ప్రోత్సాహం, నగర వాసుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఏకీకృత పాలన వ్యవస్థను పెద్దపీట వేసింది. దీంతో నగరం అనతి కాలంలోనే బ్రాండ్ విలువ అంతర్జాతీయ స్థాయికి చేరింది. దీంతోనే దేశంలో ఏ నగరానికి దక్కని ఖ్యాతిని అంతర్జాతీయ సంస్థల ప్రధాన కేంద్రాలను ఆకర్షించేలా హైదరాబాద్ అభివృద్ధి చెందింది.
నీరుగారిన విశ్వనగర ఖ్యాతి..
2007లో అధికారంలో కాంగ్రెస్ సర్కారు… నగరానికి సమీపంలో ఉన్న మున్సిపాలిటీలను విలీనం చేసి జీహెచ్ఎంసీగా ఏర్పాటు చేసింది. దాదాపు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగరానికి ఇన్నాళ్లు పాలన అందించింది. ఈ క్రమంలోనే స్వరాష్ట్రంలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్, మాజీ సీఎం కేసీఆర్ నగరాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి వేల కోట్లు ఖర్చు చేశారు. గత పదేళ్లలో నగర విస్తరణకు అనువుగా శివారు ప్రాంతాల్లో కార్పోరేషన్లు, మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దింది. ఈ క్రమంలోనే ఒక్కో మున్సిపాలిటీకి వందల కోట్లతో అభివృద్ధి చేసింది. ఓవైపు నగరాన్ని అవుటర్ వరకు విస్తరిస్తూనే, మరోవైపు ఏకీకృత బృహత్ నగరానికి ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలతో హైదరాబాద్ను తీర్చిదిద్దింది. కానీ విస్తరించిన కాంగ్రెస్ ప్రభుత్వమే మూడు ముక్కలుగా చేసి, విశ్వనగర ఖ్యాతిని నీరుగార్చింది. అభివృద్ధిలో దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే దీటుగా ఎదుగుతున్న క్రమంలో.. సీఎం రేవంత్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం.. మహానగరాన్ని విచ్ఛిన్నం చేసి హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్లుగా మార్చి వేసింది.

అనాలోచిత నిర్ణయంతో..
పదేండ్లలో హైదరాబాద్ విశ్వనగర దిశగా పయనించింది. ఇప్పుడు జీహెచ్ఎంసీ విభజన ఆ ప్రయాణానికి దిశానిర్దేశం లేకుండా పోయింది. నగరాభివృద్ధికి ఒక దీర్ఘకాలిక ప్రక్రియతో అభివృద్ధి చేసి, పదేండ్లలో వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. లక్షలాది మందికి ఉపాధినిచ్చి, అంతర్జాతీయంగా ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక జీనోమ్ వ్యాలీ కేంద్రంగా, నగరంలో ఫార్మా రంగానికి మెరుగులద్దితే… కాంగ్రెస్ సర్కారు, విభజన, విచ్ఛిన్నం పేరిట అడ్డగోలు నిర్ణయాలను అమలు చేస్తున్నది. కేవలం రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా విభజన సాగిందనే విమర్శల నేపథ్యంలో.. హైదరాబాద్ నగరానికి వచ్చే పెట్టుబడులు ప్రభావితం కానున్నాయి. గ్లోబల్ కంపెనీలను ఆకర్షించిన మహానగరం ఇతర మెట్రో నగరాలకు గట్టి పోటీనిచ్చింది. కానీ సరళీకృత పాలన విధానాల పేరిట సర్కారు తీసుకున్న అనాలోచిత నిర్ణయం.. విశ్వనగర కల చెదిరిపోయింది.
