సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎన్నికల కోడ్ అమలు కావడంతో సీపీ సీవీ ఆనంద్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, ఇతర ఎన్నికల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య, ఈవీఎంలు, ఎన్నికల సిబ్బంది, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు, భద్రతా, విజిలెన్స్ విభాగాల నియామకంతోపాటు ఎన్నికల కోడ్, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలపై పలు సూచనలు చేశారు. మొత్తం పోలీసులు, పోలింగ్ సిబ్బందితోపాటు, అదనపు సహాయక సిబ్బందితో కలిసి 35వేల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక నియోజకవర్గాలు, వివాదాస్పద పోలింగ్ స్టేషన్ల విషయంలో ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఆర్టీఏ, ఇన్కం ట్యాక్స్, ఈడీ, ఎక్సైజ్, జీఎస్టీ, కస్టమ్స్, నార్కొటిక్, పోలీస్, బల్దియా సిబ్బందితో కలిసి 18 ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మనీ సర్క్యూలేషన్, డిజిటల్ పేమెంట్లు, మద్యం అమ్మకాలు, సరఫరాను నిత్యం పర్యవేక్షించేలా ప్రత్యేక యంత్రాంగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.
ఎన్నికల షెడ్యూల్ను అనుసరించి 15 నియోజకవర్గాల్లో చేపట్టిన ఏర్పాట్లను ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ వివరించారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 1688 ప్రాంతాల్లో 3986 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3931 పోలింగ్ స్టేషన్లు, సైబరాబాద్లో 51, రాచకొండ పరిధిలో 4 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వీటికి ఒక్కో నియోజకవర్గానికి అవసమైన విజిలెన్స్ సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ ఓటరు మార్పులు, చేర్పులకు అవకాశం ఉన్నదని ఎన్నికల అధికారి తెలిపారు. అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎన్నికల నిర్వహణలో ఫిర్యాదుల కోసం 1950, 1800-599-2999 టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా సాయం పొందవచ్చన్నారు.
హైదరాబాద్ జిల్లా, అంతర్రాష్ట్ర సరిహద్దులకు సమీపంలో ఉండే ప్రాంతాలను గుర్తించామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 15 నియోజకవర్గాల పరిధిలో ఆర్టీఏ, ఇన్కం ట్యాక్స్, ఈడీ, ఎక్సైజ్, జీఎస్టీ, కస్టమ్స్, నార్కోటిక్స్, పోలీసు సిబ్బందితో కలిపి ప్రత్యేకంగా 18 సమీకృత చెక్పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు, వైన్ షాపుల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన అధికారులు.. గత ఆరు నెలలుగా జరిగిన మద్యం అమ్మకాలు, డబ్బు నిర్వహణ వంటి అంశాలతో కూడిన జాబితాను సిద్ధం చేసినట్లుగా పేర్కొన్నారు. 32 సీఆర్పీఎఫ్ కంపెనీలతో భద్రత కట్టుదిట్టం చేసినట్లుగా సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నియోజకవర్గాల్లో మూడు షిప్టుల వారీగా పర్యవేక్షించేందుకు 90 ఫ్లయింగ్ స్కాడ్స్ నిరంతరం పనిచేస్తుంటారని తెలిపారు. ఇప్పటికే పలు సెక్షన్ల కింద నేరస్తులైన వారిని గుర్తించామన్నారు.
గ్రేటర్లో ఓటింగ్ శాతాన్ని పెంచడంతోపాటు ఓటర్లను చైతన్యపరిచేలా ప్రత్యేక కార్యక్రమాలకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో థీమాటిక్ పోలింగ్ స్టేషన్లు ఉంటాయని, దివ్యాంగులు, కొత్త ఓటర్లు, మహిళలు, వృద్ధుల కోసం వారినే ఎన్నికల సిబ్బందిగా నియమించి పోలింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 75 థీమాటిక్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా సంబంధిత వర్గాలకు చెందిన వారినే పోలింగ్ స్టేషన్ల సిబ్బందిగా నియమించి ఓటర్లను పర్యవేక్షించనున్నారు. పోలింగ్ స్టేషన్ల జాబితా మాత్రమే అందుబాటులో ఉండేదని, త్వరలో మ్యాపులతో సహా అందుబాటులోకి తీసుకువస్తామని, దీంతోపాటు పార్కింగ్ ప్రాంతాలు, క్యూ లైన్ల మానిటరింగ్ వంటి అంశాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
ఎన్నికల నిర్వహణను సరళతరం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో సాంకేతిక వినియోగం పెరిగిందన్నారు. ఓటర్ అనుసంధానం, సువిధ కేంద్రాల ఏర్పాటు, ఇప్పటికే విడుదల చేసిన సీ విజిల్ యాప్తోపాటు, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా సేవలు పొందవచ్చన్నారు. అదేవిధంగా ఎలక్ట్రోరల్ జాబితాలో వివరాలను ఆన్లైన్, బీఎల్ఓ ద్వారా పునః పరిశీలన చేసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ద్వారా పొలిటికల్ పార్టీలు, అభ్యర్థులు, ర్యాలీలు, లౌడ్ స్పీకర్లు, కాన్వాయ్ అనుమతులు వంటి వాటి కోసం ఈ సింగిల్ విండో సెంటర్ సాయపడుతుందన్నారు.
80 ఏండ్లు పైబడిన వయో వృద్ధులు 100శాతం ఓటింగ్ సాధించడానికి ఎన్నికల విభాగం అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 80 సంవత్సరాలు పైబడిన వారు ఓటింగ్లో పాల్గొనేందుకు భారత ఎన్నికల సంఘం ఫారం 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించిందని ఎన్నికల అధికారి పేర్కొన్నారు.
ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ తెలిపారు. ఇప్పటికే ఈవీఎం, వీవీప్యాట్స్, యంత్రాల వినియోగంపై ప్రత్యేక శిక్షణతోపాటు మాక్ పోలింగ్ విధానంపై అవగాహన కల్పించామన్నారు. ఎన్నికల నిర్వహణ, కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు విషయంలో కఠినంగానే వ్యవహరిస్తామన్నారు. ఓటర్ల నమోదుపై కాకుండా ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించామని, ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు.
ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అక్రమ డబ్బు, మద్యం సరఫరా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 1587 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను గుర్తించామని, 32 కేంద్ర బలగాల భద్రతకు అవసరం ఉందన్నారు. గతంలో జరిగిన ఘర్షణలు, గొడవల నేపథ్యంలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, మద్యం, డబ్బు రవాణా, పంపిణీని పర్యవేక్షించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. 2252 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయని, 652 బైండోవర్, పీడీ యాక్టు 18మంది, 15 నియోజకవర్గాల్లో 15 మంది పోలీసు ఉన్నతాధికారులతో నోడల్ అధికారులు, ఆర్బీఐ, స్థానిక బ్యాంకుల సహకారంతో డిజిటల్ పేమెంట్లపై ఫోకస్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీ బందోబస్తు నిర్వహిస్తామని, తనిఖీలతో తలెత్తే ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంలోని హోటళ్లు, లాడ్జిలతోపాటు, గెస్ట్ హౌజ్లు, నగర వ్యాప్తంగా కార్డన్ సెర్చ్లు పెరుగుతాయని, పట్టుబడిన వస్తువుల విషయంలో తగిన పత్రాలు ఉంటేనే విడిచిపెడతామని, లేదంటే పలు సెక్షన్ల కింద శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు.