524 భవనాలపై స్పెషల్ డ్రైవ్ చేపడుతున్న జీహెచ్ఎంసీ
మూడు రోజుల్లో 18 భవనాలు కూల్చివేత
వారం రోజుల్లో ముగియనున్న తొలగింపు ప్రక్రియ
సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో శిథిల భవనాలపై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నది. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కూలేందుకు సిద్ధంగా ఉన్న పురాతన భవనాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని నిర్ణయించిన అధికారులు జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో 524 శిథిల భవనాలను గుర్తించారు. గడిచిన మూడు రోజులుగా సర్కిళ్ల వారీగా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్న అధికారులు 18 శిథిల భవనాలను కూల్చివేసినట్లు తెలిపారు. 24 చోట్ల భవనాలను సీజ్ చేసి మరమ్మతులు చేసినట్లు పేర్కొన్నారు.
పెండింగ్లో ఉన్న 482 భవనాలను వారం రోజుల్లోగా తొలగించనున్నట్లు టౌన్ప్లానింగ్ విభాగం అధికారులు పేర్కొన్నారు. మరోపక్క వర్షాకాలం విపత్తుల నివారణలో భాగంగా శిథిల భవనాలను గుర్తించడం, పురాతన భవనాల పటిష్టత, భద్రతపై ఇంజినీరింగ్ విభాగాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని అత్యంత ప్రమాదకరమైన భవనాలను కూల్చివేసేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం సర్వే జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదకర భవనాలకు నోటీసులు జారీ చేస్తున్నట్లు చెప్పారు.