సిటీబ్యూరో, మే 21, (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో కాంట్రాక్టర్ల పోరు ఉధృతమవుతున్నది. పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు మెయింటెనెన్స్ పనులు చేపట్టబోమంటూ ఈ నెల 18వ తేదీ నుంచి కాంట్రాక్టర్లంతా పనులు మానేసి ‘వీ వాంట్ పేమెంట్స్’ సమ్మె చేపడుతున్నారు. ఇందులో భాగంగానే గడిచిన నాలుగు రోజులుగా రోడ్లు, డ్రైనేజీలు, నాలాలు, కరెంట్ పోల్స్, పార్కులు, ప్లే గ్రౌండ్, శ్మశానవాటికల అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు, డ్రైనేజీ ఇలా మెయింటెనెన్స్ పనులు నిలిచిపోయాయి. తమకు రావాల్సిన రూ.1350 కోట్ల బకాయిలు చెల్లించే వరకు ఎట్టి పరిస్థితుల్లో పనులు చేపట్టబోమని, అవసరమైతే మాన్సూన్, ఐఆర్టీని నిలిపివేస్తామని అల్టిమేటం జారీ చేశారు. అధికారులు మే నెలకు సంబంధించి రూ.57 కోట్లు విడుదల చేశామని, ఐఆర్టీ పనులను నిలిపివేస్తే సంబంధిత కాంట్రాక్టర్లపై టెండర్ నిబంధనలకు అనుగుణంగా చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.