తాగునీటికి పైపులైన్ వేశారు..కుప్పలు మరిచారు
రోడ్డుపై వెళ్లాలంటేనే జంకుతున్న విద్యార్థులు
ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు
సైదాబాద్, ఏప్రిల్ 21 : సైదాబాద్ కరణ్బాగ్ కాలనీలో నూతనంగా తాగునీటి పైప్లైన్ ఏర్పాటు కోసం తవ్విన మట్టి కుప్పలను తొలగించకపోవటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుత్తేదారు నిర్లక్ష్యంగా కారణంగా మట్టి కుప్పలను రోడ్లపైనే వదలివేయటంతో వాహనదారులకు, పాదచారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. మట్టి కుప్పలతో ప్రమాదాలు జరుగుతున్నాయని జలమండలి అధికారులకు, గుత్తేదారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదకరంగా మారిన రోడ్డు..
సైదాబాద్ డివిజన్ పరిధిలోని ఆస్మాన్ఘడ్ విద్యుత్ కార్యాలయం నుంచి సైదాబాద్ కరణ్బాగ్ కాలనీ కేంబ్రిడ్జ్ స్కూల్ వరకు తాగునీటి రూ.5 లక్షల వ్యయంతో కొత్తగా పైప్లైన్ను ఏర్పాటు చేశారు. పైప్లైన్ కోసం తవ్విన మట్టిని గత 20 రోజులుగా నడిరోడ్డుపైనే వదిలి వేయటంతో ప్రమాదకరంగా మారింది. దీంతో నిత్యం వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు. అదే విధంగా స్కూల్కు వెళ్లే చిన్నారులు ఒక వైప్ స్కూల్ బ్యాగులను మోయలేక మరోవైపు అడ్డదిడ్డంగా ఉన్న రోడ్డుపై నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ రోడ్డుపై వెళ్లాలంటేనే జంకుతున్నారు. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించి, రోడ్డు ప్యాచ్ వర్క్ త్వరగా ఏర్పాటు చేసి కాలనీవాసుల కష్టాలను తొలగించాలని స్థానికులు జలమండలి అధికారులను కోరుతున్నారు.
మట్టిని తొలగిస్తాం..
కరణ్బాగ్ కాలనీవాసులకు తాగునీటి ఇబ్బందులను తొలగించటానికి పైప్లైన్ను ఏర్పాటు చేశాం. జంక్షన్కు కనెక్షన్ ఇచ్చే పనితోపాటు కాలనీలో మరో ఆరుపైప్లను ఏర్పాటు చేయాల్సి ఉన్నది. తాగునీటి పైప్లైన్ నిర్మాణ కోసం తవ్విన మట్టి కుప్పలను సత్వరమే తొలగించటానికి తగు చర్యలు తీసుకుంటాం. మట్టి కుప్పలను ఎత్తించడంతోపాటు రోడ్ ప్యాచ్వర్క్ పనులు పూర్తి చేయటానికి తగు చర్యలు తీసుకుంటాం.
– బి.మనోహార్, జలమండలి సైదాబాద్ డివిజన్ వర్క్ ఇన్స్పెక్టర్