సిటీబ్యూరో, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ): పాదచారుల భద్రతకు పెలికాన్ సిగ్నల్స్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. సిగ్నల్ వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు మంగళవారం ఈఎన్సీ, పోలీసు, ఎలక్ట్రిసిటీ అధికారులతో కలిసి కమిషనర్ సమీక్షించారు. జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ సమన్వయంతో నగరంలో ఏటీఎస్సీ, పెలికాన్ సిగ్నల్స్ మొత్తం 404 ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ తెలిపారు. 169 పాత సిగ్నల్స్, 113 కొత్తగా ఏటీఎస్సీ సిస్టమ్ ద్వారా మొత్తం 282 సిగ్నల్స్, పాదచారుల భద్రతకు 78 పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పెరిగిన ట్రాఫిక్ సమస్యతో పాదచారులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి పెలికాన్ సిగ్నల్ ఏర్పాటు చేయాలని పోలీస్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ను కమిషనర్ ఆదేశించారు.
నగరంలో 404 సిగ్నల్స్ను 57 కారిడార్లను ఏర్పాటు చేశారని, నాన్ కారిడార్లోని 44 సిగ్నల్స్ను ఆధునీకరించి కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ఏటీఎస్సీ సిగ్నల్స్ వ్యవస్థ మరెక్కాడాలేదని, తద్వారా నగరంలో ఏటీఎస్సీ సిగ్నల్తో 20 నుంచి 30 శాతం ప్రయాణ సమయం ఆదా అవుతుందని పోలీస్ అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్ సుధీర్బాబు వివరించారు. ఈ సమావేశంలో ఈఎన్సీ జియావుద్దీన్, ఎలక్ట్రిసిటీ ఎస్సీ శ్రీనివాస్, ఈఈ మమత, ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహిస్తున్న ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.