GHMC | సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ముసాయిదాను సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. 2023-24 సంవత్సరానికి బడ్జెట్ రూ. 6,224 కోట్లుగా ప్రతిపాదించగా, రాబోయే ఆర్థిక సంవత్సరానికి అధికారులు రూ. 8437 కోట్లుగా ఖరారు చేశారు. మారిన అవసరాలు, పెరిగిన ఖర్చులు వంటివి దృష్టిలో ఉంచుకొని గతేడాది కంటే ఈ సారిగా అదనంగా రూ. 2,213 కోట్ల పద్దును పెంచారు. గతంలో మాదిరిగానే బడ్జెట్ను రెండు భాగాలుగా (ఏ, బీ) రూపొందించారు.
ఈ సారి కూడా హెచ్ఎంసీది ఏ విభాగం కింద ఉండగా, డబుల్బెడ్రూం ఇండ్ల కోసం అందే నిధులను ‘బీ’ కేటగిరీగా చేర్చారు. ఏ కేటగిరీలో రూ.7,937కోట్లు, ‘బీ’ కేటగిరీలో డబుల్ బెడ్రూం ఇండ్లకు రూ. 500 కోట్లు కేటాయించారు. కాగా, కౌన్సిల్లో ఈ బడ్జెట్ ప్రతిపాదనపై సభ్యులు విస్తృతంగా చర్చించనున్నారు. ఆ తర్వాత కౌన్సిల్ సభ్యులు ఆమోదించిన తర్వాత అధికారులు ఈ బడ్జెట్ ప్రతిపాదనను ప్రభుత్వానికి అందజేసి అనుమతి తీసుకుంటారు.