సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): గణేశ్ ఉత్సవాలకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నెల 31నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ పదకొండు రోజుల పాటు జరిగే వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ సారి హుస్సేన్సాగర్, చెరువుల్లో పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్)తో చేసిన రంగు విగ్రహాలను నిమజ్జనం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాత్కాలికంగా ప్రస్తుతం ఉన్న 24 కోనేరులు (బేబీ పాండ్స్)తో పాటు 50 ప్రాంతాల్లో అదనంగా నిర్మిస్తున్న తాత్కాలిక పోర్టబుల్ వాటర్ ట్యాంక్లు(బేబీ పాండ్స్)ల్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేసేలా చూస్తున్నారు. ఈ మేరకు బేబీ పాండ్స్ వద్ద అవసరమైన చర్యలు ప్రారంభించారు. క్రేన్లు, సిబ్బందిని సమకూర్చేందుకు ఈవీడీఎం విభాగం అధికారులు చర్యలు చేపట్టారు.
నిమజ్జనానికి..
పీవోపీ విగ్రహాలను పోర్టబుల్ వాటర్ ట్యాంక్లు(బేబీ పాండ్స్)లలో నిమజ్జనం చేయనున్నారు. ఈ ట్యాంకులు 20 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 1.32 మీటర్ల లోతులో ఉండనున్నాయి. పీవీపీ మెటీరియల్తో తయారు చేసే ట్యాంక్ల ఏర్పాటు నుంచి నిమజ్జనం అనంతరం వాటి తొలగింపు వరకు సంబంధిత ఏజెన్సీలదే బాధ్యత ఉండనున్నది. ఆరుగురు కార్మికులను అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ఈ కొలనుల్లో 10 అడుగుల (మూడు మీటర్లకు మించని) ఎత్తున్న మట్టి విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయనున్నారు.
వివిధ చెరువుల వద్ద..
గతంలో ఎన్నడూ లేని విధంగా ఖైరతాబాద్ వినాయకుడు మట్టితో రూపుదిద్దుకోవడం, ఆ భారీ విగ్రహాన్ని సాగర్లో నిమజ్జనం చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఇక హుస్సేన్సాగర్, కాప్రా, చర్లపల్లి, నల్లచెరువు, నాగోల్, మన్సురాబాద్ పెద్ద చెరువు, సరూర్నగర్, మీర్ ఆలం ట్యాంక్, పల్లె చెరువు, పత్తికుంట, జంగమ్మెట్, రాజన్నబావి, ఎర్రకుంట, దుర్గం చెరువు, గోపి చెరువు, మల్కం చెరువు, గంగారం పెద్ద చెరువు, కొత్తకుంట, గురునాథం చెరువు, కైదమ్మకుంట, రాయసముద్రం, సాకి చెరువు, ఐడీఎల్, సున్నం చెరువు, హస్మత్పేట, అంబీరు చెరువు, వెన్నెల గడ్డ, పరికి చెరువు, లింగం చెరువు, కొత్త చెరువు, బండ చెరువు, సఫిల్గూడ మినీ ట్యాంక్బండ్ వద్ద మట్టి గణపతుల నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
నగరవ్యాప్తంగా..
వినాయక విగ్రహాల నిమజ్జనాల కోసం నగర వ్యాప్తంగా 106 స్టాటిక్ క్రేన్లు, 208 మొబైల్ క్రేన్లు, జేసీబీలు వినియోగించేలా సన్నాహాలు చేస్తున్నారు. ప్రధాన రహదారులతో పాటు నిమజ్జనానికి విగ్రహాలు ప్రయాణించే దాదాపు 350 కి.మీల మేర మార్గాల్లో రోడ్లపై ఎలాంటి గుంతలు లేకుండా వాహనాలు సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రతిఏటా మాదిరిగానే తాత్కాలిక టాయిలెట్లు, తాగునీటి వసతులు, వైద్య కేంద్రాలు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పించనున్నారు.
ఖైరతాబాద్ గణేశుడే ఆదర్శం: సీపీ సీవీ ఆనంద్
ఖైరతాబాద్, ఆగస్టు 26 : నగరంలో మట్టి విగ్రహాలపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని, ఇందుకు ఖైరతాబాద్ గణేశుడే అదర్శంగా నిలిచినట్లు నగర సీపీ సీవీ ఆనంద్ అన్నారు. శుక్రవారం ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద ఏర్పాట్లను బల్దియా కమిషనర్ లోకేశ్కుమార్, డీసీపీ రాజేశ్ చంద్ర, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్తో కలిసి పరిశీలించారు. ఉత్సవ కమిటీ తరపున చేస్తున్న ఏర్పాట్లను చైర్మన్ సింగరి సుదర్శన్, కన్వీనర్ సందీప్రాజ్లను అడిగి తెలుసుకున్నారు. నగరంలో 75 శాతం మంది ప్రజలు మట్టి విగ్రహాలపై మక్కువ చూపుతున్నారని, అందుకు ఖైరతాబాద్ గణేశుడి మట్టి విగ్రహ ప్రతిష్ఠాపనే కారణమన్నారు. భక్తులకు, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జీహెచ్ఎంసీ తరపున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని కమిషనర్ లోకేశ్ కుమార్ అన్నారు. బారికేడింగ్, లైటింగ్, స్ట్రీట్లైట్, పారిశుధ్యం తదితర అంశాలపై దృష్టి సారించామన్నారు. వారి వెంట గణేశ్ ఉత్సవ కమిటీ కార్యనిర్వహక కార్యదర్శి సింగరి రాజ్ కుమార్, సభ్యులు మహేశ్ యాదవ్ తదితరులు ఉన్నారు.