సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): ఏపీ, ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందనే పక్కా సమాచారంతో తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీనాబ్), బొల్లారం పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. రూ.3.5 కోట్ల విలువజేసే వెయ్యి కిలోల గంజాయితో పాటు రెండు వాహనాలను గుర్తించి పట్టుకున్నారు. ఈ వివరాలు టీనాబ్ ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. కర్ణాటకకు చెందిన సకారాం రాథోడ్ 2002లో హైదరాబాద్కు వచ్చి షేక్పేట్ ప్రాంతంలో పానీపూరి బండి నిర్వహించాడు. కొన్ని రోజుల తరువాత ఆ వ్యాపారాన్ని వదిలేసి బీదర్ వెళ్లాడు. అక్కడ తన తండ్రి పనిచేస్తున్న షుగర్ ప్యాక్టరీలో లేబర్ కంట్రాక్టర్గా చేరాడు. అక్కడ చాలా మంది కూలీలు గంజాయి తీసుకోవడం గమనించాడు.
గంజాయి దందాతో పెద్ద మొత్తంలో సంపాదించవచ్చని భావించాడు. ఇందుకు ఒడిశా, ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న వారితో చేతులు కలిపాడు. మరో ముగ్గురితో కలిసి దందా షురూ చేశాడు. గంజాయి రవాణా కోసం ప్రత్యేకంగా డీసీఎం వాహనం కూడా కొనుగోలు చేశాడు. అహ్మద్ఖాన్ను డ్రైవర్గా, దిగాంబర్ రాము పవర్ను క్లీనర్గా నియమించుకున్నాడు. మల్కాన్గిరిలో సన్యాసిరావు అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయి కొనేందుకు రూ. 8 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చారు. వెయ్యి కిలోల గంజాయిని డీసీఎంలో లోడ్ చేసుకొని.. మహారాష్ట్రకు బయలుదేరారు. ముందు షిఫ్టు కారు పైలెట్గా వెళ్తుండగా.. వెనుక గంజాయితో ఉన్న డీసీఎం వస్తుంది. విశ్వసనీయ సమాచారం మేరకు టీనాబ్, బొల్లారం పోలీసులు కలిసి బొల్లారంలో నిఘా పెట్టారు. రెండు వాహనాలు సీజ్ చేసి, వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన సకారం రాథోడ్, అహ్మద్ఖాన్, దిగాంబర్తో పాటు వీరిని సికింద్రాబాద్లో కలుసుకోవడానికి వచ్చిన రమావతార్ చౌరస్యను పోలీసులు పట్టుకున్నారు.