హైదరాబాద్ : అందరి సహకారంతోనే గణేశ్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతమయ్యాయని, నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా పూర్తయ్యిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించే గణేశ్ నిమజ్జనం శోభాయాత్రకు దేశంలోనే ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. నెల రోజులకుపైగా ఏర్పాట్ల కోసం శ్రమించిన జీహెచ్ఎంసీ, ఎలక్ట్రికల్, పోలీస్, ట్రాఫిక్, పోలీస్, ఆర్అండ్బీ, వాటర్ వర్క్స్, హెల్త్, ఐఅండ్పీఆర్, శానిటేషన్ తదితర అన్ని విభాగాల అధికారులు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వానికి సహకరించిన భాగ్యనగర్, ఖైరతాబాద్, బాలాపూర్, సికింద్రాబాద్ తదితర గణేశ్ ఉత్సవాల నిర్వాహకులకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ అభినందనలు తెలిపారు.