సిటీబ్యూరో, సెప్టెంబర్ 10(నమస్తే తెలంగాణ): 35 సంవత్సరాల తర్వాత గణేశ్ నిమజ్జనం రోజే మిలాద్ ఉన్ నబీ వస్తున్నదని, బందోబస్తు విషయంలో ప్రతి అధికారి జాగ్రత్తగా ఉండాలంటూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సిటీ పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గణేశ్ చతుర్థి, నిమజ్జనానికి సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లపై డీసీపీలు, ఎస్హెచ్ఓలు, పెట్రోల్, బ్లూకోల్ట్స్ సిబ్బందితో వీడియో కన్ఫరెన్స్ నిర్వహించి, బందోబస్తు ఏర్పాట్లపై సీపీ వివరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగిన పండుగలు, వేడుకలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. వీటి బందోబస్తులన్నీ సెమీ ఫైనల్ లాంటివని, గణేశ్ బందోబస్తు అనేది సిటీ పోలీసులకు ఫైనల్స్ లాంటిదని అన్నారు. ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉంటూ.. గణేశ్ బందోబస్తును నిర్వహించాలన్నారు. ఆరు దశలలో బందోబస్తును ఏర్పాటు చేయాలని, బందోబస్తుకు సంబంధించిన రోడ్ మ్యాప్, ట్రాఫిక్కు సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకొని బందోబస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
మండపాలలో విగ్రహాల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలు.. మండపాలకు సంబంధించిన సమాచారం తీసుకోవడం.. అందుకు సంబంధించిన ఫారాలను నిర్వాహకులకు పంపిణీ చేయాలన్నారు. ఆన్లైన్ సౌకర్యాన్ని మండపాల నిర్వాహకులు ఉపయోగించుకునేలా చూడాలని, విగ్రహా విక్రయాలు, విగ్రహాలను మండపాలకు తరలించే రూట్లకు సంబంధించిన అంశాలు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. మండపాల వద్దకు అధికారులు వెళ్లి.. అక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు, బారీకేడ్లు, సీసీటీవీలు, క్యూలైన్ నిర్వాహణ, ట్రాఫిక్ సమస్యలు, సామాన్యులు, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు, ఆయా ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ.. పెండింగ్లో ఉండే సివిల్ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు.
విగ్రహాల నిమజ్జనానికి కావాల్సిన క్రేన్లు, బందోబస్తు నియామకాలు, పెట్రోల్, బ్లూకోల్ట్స్ రూట్స్కు సంబంధించిన తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. నిమజ్జనం పూర్తయిన తర్వాత తిరిగి ఆయా వాహనాలు సాఫీగా వెళ్లే విధంగా రూట్ మ్యాప్ చేయాలన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు విగ్రహాలు బేబీ పాండ్స్, కృత్రిమ చెరువుల్లో నిమజ్జనం జరిగేలా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆకస్మికంగా వాహనాల తనిఖీలు, అసాంఘిక శక్తులను గుర్తించడం, ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీలు, ఫ్లాగ్ మార్చ్, సిబ్బందికి బందోబస్తుకు సంబంధించి ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ చేయాలన్నారు. సోషల్మీడియా మానిటరింగ్ విషయంలో ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మిలాద్ ఉన్ నబీకి సంబంధించిన బందోబస్తు, ట్రాఫిక్కు సంబంధించిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.