కూకట్పల్లి : దేశంలో ఎక్కడా లేనివిధంగా దేవాలయాలలో ధూపదీప నైవేద్యాలు అందించడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ( Mla Krishna Rao) అన్నారు. నియోజకవర్గంలో ధూపదీప నైవేద్యాలకు ఎంపికైన దేవాలయాల అర్చకులకు బుధవారం మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
సర్వమతాలకు, కులాలకు సమప్రాధాన్యతనిస్తూ పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ (CM KCR ) దే వెల్లడించారు. పండుగలకు కానుకలను అందజేయడం, ప్రజలందరూ కలిసిమెలిసి పండుగలను జరుపుకునేలా ఏర్పాట్లు చేస్తుందని వివరించారు. నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కూకట్పల్లి వందల ఏండ్ల చరిత్ర కలిగిన రామాలయాన్ని పునః నిర్మించడంతో పాటు ఫతేనగర్ శివాలయం, మూసాపేట లక్ష్మీనర్సింహస్వామి దేవాలయాలను సొంత ఖర్చులతో బాగు చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాండూరి నరేంద్రాచార్య, ఆయా ఆలయాల అర్చకులు ఉన్నారు . అంతకు ముందు ఫతేనగర్ డివిజన్ పరిధి సమతానగర్లో రూ. 30 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీహాల్ పైఅంతస్తు భవనాన్ని డివిజన్ కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంబించారు.