సాగర తీరం రెండో దశ ఇండియన్ రేసింగ్ లీగ్కు సిద్ధమైంది. శని, ఆదివారాల్లో ఈ పోటీలు జరుగనున్నాయి. చిత్రంలో ఎన్టీఆర్ గార్డెన్ వద్ద ఏర్పాటు చేసిన వీక్షకుల గ్యాలరీ.
సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): నగరంలో మరోసారి ఫార్ములా రేసింగ్ కార్లు రయ్… రయ్… మంటూ దూసుకెళ్లనున్నాయి. హుస్సేన్సాగర్ తీరం వేదికగా ఇండియన్ రేసింగ్ లీగ్ తుది (ఫైనల్) పోటీలు ఈనెల 10,11 తేదీల్లో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు మళ్లీ మొదలయ్యాయి. ట్రాక్ చుట్టూ ఫ్రీకాస్ట్ డివైడర్లు, వాటిపై జాలీతో రూపొందించిన ఎత్తయిన మెష్లను మళ్లీ ఏర్పాటు చేస్తున్నారు. కారు రేసింగ్ ట్రాక్ చుట్టూ 8 చోట్ల ప్రేక్షకుల గ్యాలరీలను ఏర్పాటు చేశారు.
ఇండియన్ రేసింగ్ లీగ్ గత నెల 19, 20 తేదీల్లో 5 నగరాలకు చెందిన జట్లతో పోటీలను హైదరాబాద్లో నిర్వహించారు. ఇందులో ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గోవా నగరాలకు చెందిన జట్లు ఉన్నాయి. మళ్లీ అవే టీమ్లు రెండోసారి జరుగనున్న పోటీల్లో పాల్గొననున్నాయి. గత నెల 26, 27వ తేదీల్లో చెన్నైలో, అలాగే ఈనెల 3, 4 తేదీల్లో చెన్నైలోనే రెండోసారి ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు జరిగాయి. చివరగా హైదరాబాద్ స్ట్రీట్ సర్యూట్ వేదికగా ఫైనల్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు.
ఫార్ములా రేసింగ్లో పాల్గొనే కార్లు బుధవారం నగరానికి చేరుకున్నాయి. ప్రత్యేక కంటెయినర్లలో వాటిని ఐమ్యాక్స్ పక్కన ఏర్పాటు చేసిన ప్రాంతానికి తీసుకువచ్చారు. ఇటాలియన్ స్పోర్ట్స్ ప్రోటోటైప్స్ చాంపియన్ షిప్లో వినియోగించిన కార్లను ఇక్కడ వినియోగిస్తున్నారు. హైదరాబాద్లో జరిగే రేసింగ్ కోసం వోల్ఫ్ జీబీ08 థండర్ మోడల్ కార్లను వినియోగిస్తున్నారు. వోల్ఫ్ రేసింగ్ టీమ్లోని నిపుణులు కార్ల నిర్వహణ చేపడుతున్నారు. పోటీలు ముగిసే వరకు ఈ నిపుణులు ఇక్కడే ఉండి కార్ల నిర్వహణ పనులు చేయనున్నారు. ఇందుకోసం ఐమ్యాక్స్ పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని ప్రత్యేకంగా కార్ల నిర్వహణ కోసం కేటాయించారు. ఫార్ములా ఈ-రేస్ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 11వ తేదీ రాత్రి 10 గంటల వరకు వివిధ కూడళ్లలోట్రాఫిక్ను మళ్లిస్తున్నారు.