సిటీబ్యూరో, మే 25(నమస్తే తెలంగాణ): నగర శివారులోని చిలుకూరు మృగవని జాతీయ ఉద్యానవనం పచ్చని అందాలకు, జంతు, జీవ జాతులకు నిలయంగా ఉంది. అభివృద్ధి, అవసరాల పేరుతో అటవీ ప్రాంతంలోని భూములను వినియోగించడం వల్ల అటవీ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత దెబ్బ తింటోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు అటవీ ప్రాంతంలోంచే హైటెన్షన్ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయడం వల్ల మృగవని పార్కులో జంతు, పక్షు జాతులకు ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని వారు వాపోతున్నారు.
ప్రధానంగా అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అదనపు హైటెన్షన్ ఎలక్ట్రికల్ లైన్లతో ఆ ప్రాంతంలో నివసించే ప్రాణులపై తీవ్ర ప్రభావం చూపుతోందని, దీనిపై పర్యావరణ వేత్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్లోనూ విచారణ జరిగింది. ఈ సందర్భంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ పలు అంశాలపై అటవీ శాఖను ప్రశ్నించింది. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల ఆవాసాలు చిన్నాభిన్నం కావడం పక్షుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడటం, టవర్ల కోసం 1851 చెట్లను నరికివేయడం వంటి వాటిపై పర్యావరణ వేత్తలైన దొంతి నరసింహారెడ్డి, మహేష్ మామిండ్లలు కలిసి పిటిషన్ను దాఖలు చేశారు.
మృగవని అటవీ ప్రాంతం మీదుగా తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ నిర్మించిన ఐదు విద్యుత్ టవర్ల డిజైన్లు ఎందుకు మార్చారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ప్రశ్నించింది. ప్రతిపాదిత ప్రాజెక్టులో క్వాడ్ పోల్స్ను ఏర్పాటు చేస్తామని చెప్పి, ఆ తర్వాత మోనో పోల్స్ను ఏర్పాటు ఎందుకు చేయాల్సి వచ్చిందని ఎన్జీటీ నిలదీసింది. ఇలా అటవీ ప్రాంతంలో నిర్మించే పోల్స్ నిర్మాణంలో మార్పు చేయడం వల్ల ఎవరికి లాభం చేకూరిందని ఎన్జీటీ అడిగింది. ఈ కేసులో విచారణలో అటవీ శాఖ, తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్లు ఇచ్చిన వివరణతో ఎన్జీటీ సంతృప్తి చెందలేదు.
మొయినాబాద్ మండల పరిధిలో ఉన్న చిలుకూరు మృగవని అటవీ ప్రాంతాన్ని తొలిసారిగా 1998లో నోటిఫై చేసి జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. ఆ సమయంలో మృగవని అటవీ ప్రాంతం మొత్తం 360 హెక్టార్లుగా ఉంది. ఆ తర్వాత కాలానుగుణంగా జరిగిన అభివృద్ధిలో ఈ అటవీ ప్రాంతానికి చెందిన స్థలం తగ్గిపోయింది. సుమారు 80 హెకార్ల వరకు తగ్గి మొత్తం విస్తీర్ణం 280.90 హెక్టార్లుగా ఉందని అటవీ శాఖ నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్కు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
2011లో నిర్వహించిన డిఫరెన్షియల్ జీపీఎస్ సర్వేలో పార్కు విస్తీర్ణం 287.48 హెక్టార్లుగా నిర్థారించినట్లు అటవీ శాఖ వెల్లడించింది. కాగా మృగవని అటవీ ప్రాంతం విస్తీర్ణం తగ్గిపోవడం పట్ల పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ ఉద్యావనం అయిన పార్కులో అటవీ ప్రాంతం విస్తీర్ణం ఎక్కువ మొత్తం తగ్గిపోవడం ఆందోళనకరమని, దాన్ని సంరక్షించాల్సిన అవసరం ఉందని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. ఈ అంశంపై జాతీయ వన్యప్రాణి బోర్డు స్వతంత్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని పార్కు రక్షణ కోసం పోరాడుతున్న మాజీ సైనికుడు సందీప్ ఖురానా అభిప్రాయపడ్డారు. 2011 నుంచి 2023 మధ్య 6.7 హెక్టార్ల వ్యత్యాసాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశ్నించారు.