హైదరాబాద్ : రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో (PJTSAU)ఫుడ్ పాయిజన్ సంఘటన కలకలం రేపింది. యూనివర్సిటీ హాస్టల్లో భోజనం చేసిన అనంతరం దాదాపు 25 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలిసింది.
ఆహారం కలుషితం కావడంతో విద్యార్థులు డీహైడ్రేషన్, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. పరిస్థితి విషమించడంతో యూనివర్సిటీ సిబ్బంది వెంటనే స్పందించి బాధిత విద్యార్థులను చికిత్స నిమిత్తం రాజేంద్రనగర్తో పాటు సమీప ప్రాంతాల్లోని పలు హాస్పిటల్స్కు తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు తెలిసింది.