విలువైన భూమి ఆక్రమణకు చెక్
యజమాని ప్రమేయం లేకుండా గోల్మాల్
పోర్టల్ తనిఖీలో ఫోర్జరీ గుర్తింపు
మోసగాళ్లను పట్టుకోవాలని సైబర్ క్రైం పోలీసులకు టెకీ ఫిర్యాదు
సిటీబ్యూరో, మే 26(నమస్తే తెలంగాణ): భూమి క్రయ విక్రయాలకు సంబంధించి లోపభూయిష్టమైన విధానాలకు చెక్ పెట్టిన ధరణి.. ఓ టెకీకి చెందిన ఖరీదైన స్థలాన్ని కబ్జా చెర నుంచి కాపాడింది. తన జాగలో ఎవరో నాలా కన్వర్షన్కు పెట్టారని ధరణి పోర్టల్ ద్వారా తెలుసుకున్న బాధితుడు.. వెంటనే అప్రమత్తమయ్యాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, రెవెన్యూ అధికారులు, రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో వెల్లడించిన వివరాల ప్రకారం… ఎల్బీనగర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్కు యాచారం మండలం సర్వే నం. 337,338, 352లో 8.36 ఎకరాల భూమి ఉన్నది. ఈ వివరాలను ధరణి పోర్టల్లో తనిఖీ చేసుకోగా, గుర్తు తెలియని వ్యక్తులు సదరు సర్వే నంబర్ భూమిని మొత్తం నాలా కన్వర్షన్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తించాడు. ఈ దరఖాస్తు బయోమెట్రిక్, విట్నెస్ కోసం పెండింగ్లో పెట్టినట్లు తెలుసుకున్నాడు.
కావాలనే..
సదరు టెకీ నాలా కన్వర్షన్ కోసం ఎవరు దరఖాస్తు చేశారని ఆరా తీస్తే సమాచారం తెలియరాలేదు. కొందరు కావాలనే ఫోర్జరీ చేసి.. నాలా కన్వర్షన్కు దరఖాస్తు చేశారని, వారిని వెంటనే గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ సమీప బంధువుకు సంబంధించిన స్థలానికి కూడా ఇదే విధంగా ఫోర్జరీ కింద నాలా కన్వర్షన్కు దరఖాస్తు చేశారని పోలీసుల దృష్టికి తీసుకువచ్చాడు. ఈ ఫిర్యాదు పై సైబర్ క్రైం పోలీసులు సెక్షన్ 406, 417, 419, 420 కింద అభియోగాలను నమోదు చేశారు.
ఒక్క క్లిక్తో
ధరణి పోర్టల్లో స్థలాలకు సంబంధించిన వివరాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. ఎవరైనా సరే ఓ క్లిక్తో వారి భూమి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడినుంచైనా సర్వే నంబర్లతో లాగిన్ అయ్యి.. అందులో పరిశీలించుకుంటే తెలిసిపోతుంది. మీ ప్రమేయం లేకుండా ఎవరైనా సరే.. మీ స్థలానికి సంబంధించిన వాటిలో వ్యవహారాలు నడిపినా తెలిసిపోతుంది. ఒకవేళ ఏదైనా గోల్మాల్ జరిగినట్లు తేలితే.. రాత పూర్వకంగా తాసీల్దార్ ఆఫీసులో ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. ఆ స్థలంలో తదుపరి ఎలాంటి వ్యవహారాలు జరగకుండా అధికారులు ఆపేస్తారు. ఇలా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తన కోట్లాది రూపాయాల విలువ చేసే స్థలాన్ని నాలా కన్వర్షన్కు పెట్టారని తెలుసుకొని.. ఇతరుల పాలుకాకుండా కాపాడుకోగలిగాడు.