Hyderabad | సిటీబ్యూరో, మార్చి 14(నమస్తే తెలంగాణ) : నగరంలో శబ్ద కాలుష్య తీవ్రత పెరుగుతూనే ఉంది. ఏటా నగరంలో పరుగులు పెడుతున్న వాహనాలతో మోత మోగిపోతున్నది. కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి ప్రామాణికాన్ని దాటి రణగొణ ధ్వనులు వ్యాప్తి చెందుతున్నాయి. గడిచిన రెండేళ్లలో ధ్వని కాలుష్య తీవ్రత పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. రద్దీ ప్రాంతాలు, ఇండస్ట్రియల్ ఏరియాల్లో సాధారణంగా వినిపించే తీవ్రమైన శబ్దాలు.. కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లోకి వ్యాపిస్తున్నాయి. మోడిఫైడ్ హారన్లు, సందడి చేసే డీజేలతో గూబ గుయ్యుమంటున్నది.
నగరంలో నానాటికి పెరుగుతున్న వాహనాలు, విస్తరిస్తున్న నగర పరిధి, మోడిఫైడ్ వాహనాలు, పాత బండ్ల వినియోగం హైదరాబాద్ వ్యాప్తంగా ధ్వని తీవ్రత పెరిగేలా చేస్తున్నాయి. ఓవైపు శబ్ద కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా.. ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు. ప్రస్తుతం నగరంలో సీపీసీబీ నిర్దేశించిన ప్రమాణాల కంటే ధ్వని తీవ్రత పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో 20శాతం మందిలో చెవి సంబంధిత వ్యాధులు ఉన్నట్లుగా అధ్యయనాలు వెలువడుతున్న నేపథ్యంలో..నగరంలోనూ పరిధి దాటి శబ్ద కాలుష్యం పెరుగుతున్నది.
నగరంలో మొత్తంగా 10 కమర్షియల్, రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్ ప్రాంతాలను ప్రామాణికంగా తీసుకుని కాలుష్య నియంత్రణ మండలి ధ్వని తీవ్రతను లెక్కిస్తుంది. ఇలా ప్రాంతానికో తీరుగా శబ్ద కాలుష్యాన్ని పరిగణనలోకి తీసుకుని నెలవారీ నివేదికలను సిద్ధం చేస్తున్నది. అయితే గడిచిన రెండేళ్లలో సీపీసీబీ నిబంధనల కంటే ఎక్కువగా నమోదు అవుతుంది. నిత్యం వాహనాల రద్దీ ఉండే తార్నాక ప్రాంతం రెసిడెన్షియల్ ఏరియాలో ఉండగా ఇక్కడ పగటి పూట ప్రామాణిక శబ్ద తీవ్రతను 55 డెసిబుల్గా నిర్ధారించారు. కానీ గతేడాది డిసెంబర్ నెలలో 63.64 డెసిబుల్స్గా నమోదైంది. అదేవిధంగా రాత్రిపూట జూబ్లీహిల్స్ పరిధిలో 45డెసిబుల్స్ పరిమితి విధిస్తే ఇందులో 72.04 డెసిబుల్స్ ధ్వని తీవ్రతగా నమోదైంది. ఇలా నగరంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో 10-15 డెసిబుల్స్ తీవ్రతతో శబ్దాలు వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
రెండేళ్ల కిందట పోలీసులు నిర్వహించిన సౌండ్ పొలుష్యన్ నియంత్రణ డ్రైవ్లో 2వేలకు పైగా కేసులు నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా శబ్ద కాలుష్యానికి
కారణం మోడిఫైడ్ సైలెన్సర్లతోనేనని వెల్లడైంది. మోడిఫైడ్ సైలెన్సర్లు ఏకంగా 100 డెసిబుల్స్ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయని తేలింది. అదేవిధంగా కాలం చెల్లిన వాహనాల రాకపోకలు, వీటితోపాటు భారీ వాహనాలతో శబ్ద తీవ్రత విపరీతంగా పెరుగుతున్నది. ప్రస్తుతం నగరంలో నో హారన్ జోన్లుగా ప్రకటించి ధ్వని కాలుష్య నియంత్రణకు చర్యలు అమలు చేస్తున్నప్పటికి..రాత్రి పూట యువకులే భారీ సౌండ్స్ వచ్చే సైలెన్సర్లతో ఇబ్బంది పెడుతున్నారని కాలనీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.