ఎర్రగడ్డ, ఆగస్టు 10 : గ్రేటర్ పరిధిలో ఆర్టీసీకి అధిక ఆదాయం వస్తున్న ప్రధాన రూట్లలో బోరబండ ఒకటి. బోరబండ నుంచి నిత్యం 10 వేల మంది వరకు ఆర్టీసీ బస్సులలో రాకపోకలను కొనసాగిస్తుంటారు. ఐతే అందులో బస్ పాస్ను వినియోగించుకునే వాళ్ల సంఖ్య అధికంగా ఉంటుంది. బస్ పాస్ను పొందాలంటే సనత్నగర్, ఎస్సార్నగర్ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బోరబండ బస్టాండ్లో తాజాగా మొబైల్ బస్పాస్ కౌంటర్ను ఏర్పాటు చేసింది.
అన్ని రకాల ఆర్టీసీ బస్పాస్లను జారీ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి నెల 7,8,9 వ తేదీల్లో.. అంటే వరుసగా మూడు రోజుల పాటు ఈ కౌంటర్ అందుబాటులో ఉంటుందన్నమాట. బోరబండతో పాటు మోతీనగర్, వీకర్సెక్షన్, శ్రీరాంనగర్ తదితర ప్రాంతాల ఆర్టీసీ ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారి కోరారు.
కార్గో పార్సిల్, కొరియర్ సేవలకూ స్పందన..
బోరబండ బస్టాండ్లో ఆర్టీసీ ఏర్పాటు చేసిన కార్గో పార్సిల్, కొరియర్ సేవలకూ కూడా మంచి స్పందన లభిస్తున్నది. వివిధ జిల్లాల్లోని వ్యాపారులు ఇక్కడ కొనుగోలు చేసిన సామగ్రిని తరలించటానికి ఈ కార్గో సేవలను వినియోగించుకుంటున్నారు. ఇక్కడ స్థిరపడ్డ గ్రామీణ ప్రాంతానికి చెందిన వాళ్లు తమతమ ఊళ్ల నుంచి బియ్యం, ఇతర ధాన్యాలను ఆర్టీసీ కార్గో ద్వారా తెప్పించుకుంటున్నారు. ఇక ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య బోరబండ బస్టాండ్కు ఎప్పుడు వెళ్లినా నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే కనీసం ఏడెనిమిది ఆర్టీసీ బస్సులు కదలటానికి రెడీగా ఉంటాయి.