సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : ఫ్యూజ్ పడిపోతే.. గంట వరకు కరెంట్ రాదు.. ఇది మహానగరంలో ప్రస్తుత పరిస్థితి. ఉన్నతాధికారులు చెప్పేదానికి.. క్షేత్ర స్థాయిలో జరిగే దానికి పొంతన లేకుండా పోయింది. అధికారులు ఎలాంటి కోతలు లేవని చెబుతున్నప్పటికీ.. సిబ్బంది మాత్రం వాతలు పెడుతూనే ఉన్నారు. సబ్ స్టేషన్ల నుంచి నిరంతరం నాణ్యమైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వరకు సాఫీగా సరఫరా అవుతున్నప్పటికీ కాలనీల్లోని ఇండ్లకు మాత్రం చేరడం లేదు. కేవలం ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఉత్పన్నమవుతున్న సమస్యను పరిష్కరించడంలో విద్యుత్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. మా కాలనీలో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడిందని కాలనీల వాసులు ఫోన్లు చేస్తే స్పందించడం లేదు. ఒకవేళ స్పందించినా.. దాన్ని పునరుద్ధరించేందుకు విద్యుత్ సిబ్బంది గంటల తరబడి సమయం తీసుకుంటున్నారు. ఈ సమస్యను గ్రేటర్ పరిధిలో ప్రతి రోజు ఎక్కడో ఒకచోట ఎదుర్కొంటూనే ఉన్నారు.
కొత్త కనెక్షన్లపైనే ఆసక్తి
నగరంలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం మొత్తం 9 సర్కిళ్లు, వాటి పరిధిలో డీఈ ఆపరేషన్స్తో పాటు ఏడీఈ కార్యాలయాలు, సెక్షన్ కార్యాలయాలను సైతం ఏర్పాటు చేశారు. ప్రతి సెక్షన్ పరిధిలో క్షేత్ర స్థాయిలో లైన్ ఇన్స్పెక్టర్లతో పాటు లైన్మెన్లు, వారికి సహాయకులుగా హెల్పర్లు (ఆర్టిజన్స్) విధుల్లో ఉంటున్నా, విద్యుత్ అంతరాయం విషయంలో తలెత్తున్న సమస్యలపైన పూర్తి స్థాయిలోదృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సెక్షన్ అధికారులు కొత్త కనెక్షన్లు ఇవ్వడంలో చూపుతున్న ఆసక్తిని విద్యుత్ సరఫరా విషయంలో చూపడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి.
ఎమర్జెన్సీ బృందాలు తక్కువ
కాలనీల్లో ఆకస్మాత్తుగా కరెంటు పోతే పునరుద్ధరించేందుకు వినియోగదారులు సెక్షన్ కార్యాలయానికి ఫోన్ చేస్తే ఎమర్జెన్సీ బృందాలకు ఫోన్ చేయాలని చెబుతున్నారు. ఎమర్జెన్సీ బృందాలకు చెబితే తాము వేరే ఫిర్యాదు వస్తే దాన్ని సరిచేస్తున్నామని, సమయం పడుతుందంటూ ఫోన్ పెట్టేస్తున్నారు. ప్రతి సెక్షన్ పరిధిలో ఉండే లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, వారికి సహాయకులుగా ఉండే హెల్పర్లు విధుల్లో ఉంటున్నా.. సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యుత్ సరఫరా కోసం ఎమర్జెన్సీ బృందాలు వచ్చి సరిచేసే వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి క్షేత్ర స్థాయిలో నెలకొంది.
ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఫ్యూజ్ పోతే దాన్ని సరిచేసేందుకు 10-15 నిమిషాలు పడితే, ఎమర్జెన్సీ బృందాలు రావడానికి మాత్రం గంటకు పైనే పడుతున్నదని ఫిర్యాదు దారులు వాపోతున్నారు. నిరంతరం క్షేత్ర స్థాయిలో ఉండాల్సిన లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు సబ్ స్టేషన్ వద్ద, సెక్షన్ కార్యాలయాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నా వారిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కరెంటు లేదని ఫిర్యాదు వస్తే మాత్రం వెంటనే ఎమర్జెన్సీ టీమ్ ఉందని, వారికి చేయాలని సలహాలు ఇస్తున్నారే తప్ప, సమస్యను పరిష్కరించేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుపుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.