సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. చాలా రోజుల తరువాత ఎన్నికలు జరుగుతుండటంతో క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగేందుకు ఆయా పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అధికార బీఆర్ఎస్లో మాజీలు, ముఖ్య నేతలు పోటీకి సై అంటున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రక్రియ పై మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఎనిమిది వార్డుల్లో ఇప్పటికే ఆరుగురు సిట్టింగ్ మాజీ సభ్యులు పార్టీలోనే ఉండటంతో పాటు మరో రెండు వార్డుల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సంప్రదింపులు జరుపుతున్నారు.
జనంలోకి బీఆర్ఎస్ నేతలు
కంటోన్మెంట్ ఎన్నికలకు రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఆశావహులతో పాటు బోర్డు మాజీ సభ్యులు దూకుడు పెంచారు. దీంతో వారి అనుచరులు, కేడర్ కూడా ఇదే స్థాయిలో ఆయా వార్డుల్లో కార్యక్రమాల జోరు పెంచింది. రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న సంఘటనలు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. బోర్డు మాజీ సభ్యులు ప్రభుత్వ అభివృద్ధి పథకాలతో ముందుకెళ్తుండగా.. మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పరామర్శలు, సొంత కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు.
క్షేత్ర స్థాయిలో బోర్డు మాజీ సభ్యులు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి నేతృత్వంలో బోర్డు మాజీ సభ్యులు ఆయా వార్డుల్లో క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. ఇంటింటికీ తిరుగుతూ రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎప్పటికప్పుడు మర్రి రాజశేఖర్రెడ్డి నేతలకు దిశా నిర్ధేశం చేస్తున్నారు. మరోవైపు అసంతృప్తులను బుజ్జగించడంతో పాటు ఆశావహులను పార్టీ లైన్లోకి తీసుకొచ్చేందుకు ఆయన ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బోయిన్పల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి ఆయా వార్డుల ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఆదేశాలను పాటిస్తూ కంటోన్మెంట్ బోర్డుపై బీఆర్ఎస్ జెండా ఎగురవేసే దిశగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు.
బీఆర్ఎస్ దూకుడుతో… ప్రతిపక్షాల బేజారు
ఎన్నికల వేడి రగలడంతో అధికార బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచగా, బీజేపీ, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు కనుచూపు మేర కూడా కనిపించడం లేదు. బీజేపీలో అసమ్మతి కారణంగా ఇప్పటికే ఆ పార్టీకి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా కేశవరెడ్డి రాజీనామా చేయగా, ఆయన బాటలోనే 1,2,4,5,7,8 వార్డులకు చెందిన నేతలు నడవనున్నారనే ప్రచారం జరుగుతోంది. టికెట్లపై ఆశ, గెలుస్తామనే భరోసా లేకపోవడంతో కమలం పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్లో అసలు పోటీకి నిలిచేందుకు అభ్యర్థులే లేకపోవడం గమనార్హం. ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన నేతలు ప్రజల్లో తిరుగుతుండగా, బీజేపీ, ఇతర పార్టీల నేతలు కనీసం ఇంటి నుంచి బయటకు రావడం లేదు. దీంతో ఆయా పార్టీల శ్రేణులు నైరాశ్యంలో మునిగినట్లు కనిపిస్తున్నది.