బడంగ్పేట, సెప్టెంబర్ 28: పేదలకు గూడు కల్పిస్తే.. ప్రతిపక్షాల కడుపు మండుతున్నదని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల గ్రామంలో రెడ్డి, యాదవ, నాయీబ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, ఎస్సీ, గంగపుత్ర, పద్మశాలి, శాలివాహన సంఘాల ఆత్మగౌరవ భవనాలకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పి.కార్తీక్ రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశంలో ఎక్కడైనా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తుందా.., కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలలో తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పేదలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తానని.., సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలో అన్ని కులాలకు రూ.15 కోట్ల వ్యయంతో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తే ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. పరిశ్రమలకు సంబంధించిన విలువైన భూమిని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో తీసుకొని ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. మహేశ్వరంలో దళితులకు ఎకరా భూమిలో కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇస్తామని చెప్పారు. రావిర్యాలలో ఆసుపత్రితో పాటు ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు.
తుక్కుగూడ వరకు మెట్రోల్ రైల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను అడుగగా.. రూ.6,600 కోట్లతో కందుకూరు వరకు మెట్రో రైల్ పొడిగించారని చెప్పారు. తుక్కుగూడలో ఏర్పాటు చేయబోతున్న 52 కంపెనీలలో 30వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మయ్య, కౌన్సిలర్లు సుమన్, రవినాయక్, సురేశ్, కమిషనర్ వెంకట్రామ్, కుల సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.