గెలువలేకనే కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతున్నది. గురువారం నామినేషన్ పర్వంలో కాంగ్రెస్ వర్గీయులు బీఆర్ఎస్ కార్యకర్తలపై రాళ్లతో దాడులు చేయడం కలకలం రేపింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ రణరంగంగా మారింది. ఇందులో ఇరవై మందికి పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు, పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డికి ప్రజల్లో వస్తున్న విశేష స్పందనను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి దాడులకు కుట్రలు చేస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది హేయమైన చర్యగా ప్రజలు ఖండిస్తున్నారు.
-రంగారెడ్డి, నవంబర్ 9(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకున్నది. ఓటమి భయం ఖాయమన్న ఉద్దేశంతో ఆ పార్టీ దాడులకు తెగబడుతున్నది. నామినేషన్ సందర్భంగా గురువారం కాంగ్రెస్ వర్గీయులు బీఆర్ఎస్ కార్యకర్తలపై రాళ్లతో దాడులు జరిపి కవ్వింపు చర్యలకు పూనుకున్నారు. దీంతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఇబ్రహీంపట్నం రణరంగంగా మారి రక్తం చిందింది. 20 మందికి పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడగా.. పలువురు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి పట్ల ప్రజల్లో వస్తున్న విశేష స్పందనను చేసి ఓర్వలేక కాంగ్రెస్ దాడులకు పాల్పడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది హేయమని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.
– రంగారెడ్డి, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ)
అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్తుంటే.. కాంగ్రెస్ మాత్రం గుండాగిరితో ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే కొత్త కుట్రలకు ఆ పార్టీ నాయకులు తెరలేపుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి గతంలో ఇదే ప్రాంతం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఎన్నికల సందర్భంలోనే చుట్టపు చూపుగా వచ్చి వెళ్లే ఈయనను స్థానికులు పారాచ్యూట్ నేతగా పిలుస్తుంటారు. ఈసారి మరోసారి ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న ఆయన అడ్డదారులను ఎంచుకున్నారు.
ఎలాగైనా గెలిచి తీరాలన్న తలంపుతో డబ్బు, దౌర్జన్యం ఎజెండాగా పెట్టుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకున్న ఘటనే ఇందుకు ఉదాహరణగా పలువురు పేర్కొంటున్నారు. దాడులకు పాల్పడడమే కాకుండా.. బీఆర్ఎస్ పార్టీయే దాడులకు దిగిందని మల్రెడ్డి ఫేక్ ప్రచారానికి దిగడంతో జనమే విస్తుబోతున్నారు. మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం ఘటన కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు తెచ్చింది. అయినా.. ఆ పార్టీ నేతలు అదే తరహా వ్యూహాన్ని ఎంచుకోవడాన్ని ప్రతిఒక్కరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. వరుస సంఘటనలతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతున్నది.
ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి పక్కా ప్లాన్తోనే జరిగినట్లు తెలుస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టే ధోరణిలో కాంగ్రెస్ వర్గీయులు వ్యవహరించారు. మొదట కవ్వింపు చర్యలకు దిగిన కాంగ్రెస్ వర్గీయులు ఆ తర్వాత దాడులకు దిగారు. ఆత్మరక్షణ కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు వాటర్ బాటిళ్లు, చెప్పులను విసిరితే కాంగ్రెస్ వర్గీయులు మాత్రం రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో రక్తం చింది బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. స్నేహశీలిగా, నిస్వార్థ ప్రజా సేవకుడిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డికి మంచి పేరు ఉంది.
ఐదేండ్ల కాలంలో సుమారు రూ.3వేల కోట్లతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ రూపురేఖలనే మార్చివేశారు. ఇప్పటికే వరుసగా మూడు పర్యాయాలు గెలిచిన ఆయన నాలుగోసారి కూడా గెలుపును కైవసం చేసుకునేందుకు అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అన్ని వర్గాల నుంచి ఆయనకు పెద్దఎత్తున మద్దతు లభిస్తుండగా.. ఈసారి ఎన్నికల్లోనూ మంచిరెడ్డికే ప్రజలు జైకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఓటమి తప్పదని తెలిసి కాంగ్రెస్ పార్టీ దాడులకు తెగబడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నది.
ఇబ్రహీంపట్నం, నవంబర్ 9 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మరోమారు ఓడిపోతానన్న భయంతోనే కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఆ పార్టీ నాయకులు క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, జడ్పీటీసీ జంగమ్మ, ఎంపీపీ నర్మదలతో కలిసి ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మూడుసార్లు మల్రెడ్డి సోదరులు ఓటమికి గురయ్యారని, ఈసారి కూడా ఓడిపోతామన్న భయంతోనే ప్రశాంతంగా ఉన్న ఇబ్రహీంపట్నంలో ఘర్షణలు, ఆందోళనలు సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు శాంతియుతంగా వెళుతున్న తమ ర్యాలీకి కాంగ్రెస్ అభ్యర్థి రంగారెడ్డి ర్యాలీ అడ్డుపడిందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని.. ఆ పార్టీ అభ్యర్థి రెచ్చగొట్టేలా ప్రసంగించటం వల్లే ఈ దాడులు జరిగాయన్నారు. కాంగ్రెస్వారి దాడిలో సుమారు 36 మంది వరకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారని తెలిపారు. ఐదుగురు పోలీసులు కూడా గాయపడ్డారని ఆయన చెప్పారు.
నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉందని.. దీనికి తోడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈసారి కూడా ఓటమి తప్పదన్న భయంతోనే ఘర్షణకు పాల్పడ్డారన్నారు. ప్రశాంతంగా ఉన్న ఇబ్రహీంపట్నంలో ఘర్షణలు, దాడులకు పాల్పడితే ప్రజలు మరోసారి బుద్ధి చెబుతారని హితవు పలికారు. కాంగ్రెస్ నాయకులు తాము ప్రజలకు ఏమి చేస్తామో చెప్పుకోవాలి తప్పా.. దాడులకు పాల్పడటం సరైన పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ శ్రేణులు గెలువక ముందే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని, ప్రజలు దీనిని గుర్తించాలన్నారు. బీఆర్ఎస్ శ్రేణులపై, పోలీసులపై దాడులు జరిపిన కాంగ్రెస్ నాయకులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇబ్రహీంపట్నంలో గురువారం నామినేషన్ల సందర్భంగా తలెత్తిన ఘర్షణ నేపథ్యంలో పోలీసులు ఇబ్రహీంపట్నంలో హైఅలర్ట్ ప్రకటించారు. రాచకొండ సీపీ చౌహాన్, జాయింట్ సీపీ తరుణ్జోష్, డీసీపీ శ్రీనివాస్, పలువురు ఏసీపీలతో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు బలగాలతోపాటు సీఐఎస్ఎఫ్ బలగాలను కూడా రంగంలోకి దించారు. నామినేషన్ల సందర్భంగా తలెత్తిన ఘర్షణలతో గ్రామాల్లో కూడా ఘర్షణలు తలెత్తే అవకాశమున్నందున పోలీసులు హైఅలర్ట్ను ప్రకటించారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన ఘర్షణపై సమగ్ర విచారణ జరుపుతున్నామని, సీసీ ఫుటేజ్ల ఆధారంగా బాధ్యులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరస్పర ఘర్షణలకు బాధ్యులైన వారితో పాటు పోలీసులను గాయపర్చిన వారిని కూడా గుర్తించి కేసులు నమోదు చేస్తామన్నారు.
ఇబ్రహీంపట్నంలో గురువారం జరిగిన దాడిని సీరియస్గా తీసుకున్నామని సీపీ చౌహాన్ అన్నారు. రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను పంపించామని.. ప్రజలెవరూ రోడ్లపైకి గుంపులుగా రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇబ్రహీంపట్నంలో సీఐఎస్ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఘర్షణలకు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరపడం కోసం సహకరించాలని చౌహాన్ తెలిపారు.