రూ.10.67 కోట్లతో పైపులైన్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
బడంగ్పేట, ఏప్రిల్ 13: మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆధిత్యనగర్ పేజ్-3, పోస్ట కాలనీ, లక్ష్మీనగర్, ప్లాటినమ్ సిటీ, వైకుంఠపురం, కృష్ణ సాయికాలనీలో రూ.10.67 కోట్లతో తాగునీటి పైపులైన్ పనులకు మంత్రి బుధవారం సాయంత్రం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కృష్ణ, గోదావరి జలాలను తీసుకొచ్చి తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉండటానికి ప్రభుత్వం ప్రతి కాలనీకి మంచినీటి పైపులైన్లు వేయించడం జరుగుతుందన్నారు. 50 సంవత్సరాల వరకు నీటి సమస్య రాకుండా ఉండటానికి ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వచ్చిన నీటిని నిల్వ చేయడానికి రిజర్వాయర్లను నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు.
పట్టణ శివారు ప్రాంతాల్లో నీటి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం రూ.1200 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించిన్నట్లు తెలిపారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్కు రూ.20కోట్లు పైపులైన్ కోసం కేటాయించిన్నట్లు తెలిపారు. వచ్చిన నీళ్లు నిల్వ ఉండటానికి రిజర్వాయర్ల నిర్మాణం చేయబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, కార్పొరేటర్లు రామిడి కవితారాంరెడ్డి, గడ్డం లక్ష్మారెడ్డి, శంకర్, ఇంద్రసేన, శ్రీధర్రెడ్డి, సూర్ణగంటి అర్జున్, కోఆప్షన్ జగన్ మోహన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అనంతరం షరీఫ్ నగర్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు.