Hyderabad | దశాబ్ద కాలంగా జలసిరితో ఉన్న భాగ్యనగరి ప్రజల గొంతు ఒక్కసారిగా ఎండిపోయింది. సరిగ్గా పదేండ్ల కిందట రోడ్లపై దర్శనమిచ్చిన బిందెలు, డ్రమ్ములు ఇప్పుడు మళ్లీ దర్శనమిస్తున్నాయి. కాంగ్రెస్ పుణ్యమా అని.. ట్యాంకర్ల వద్ద సిగపట్టు యుద్ధ్దాలు మళ్లీ మొదలయ్యాయి. ఉద్యోగాలకు డుమ్మా కొట్టి.., కూలీకి ఎగ్గొట్టి.. నీటికోసం రాత్రింబవళ్లు జాగారం చేయాల్సిన పరిస్థితులు మళ్లీ రానేవచ్చాయి. పదేండ్ల పాటు భగీరథ నీటిని తాగిన ప్రజలు మళ్లీ బోరుబావులు, బోరింగుల నీటిని తాగి దాహం తీర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు స్నానం చేద్దామన్నా.. బాత్రూమ్ పోదామన్నా.. నీరు సరిపోతాయో.. లేదో.. అని ఆలోచించాల్సిన దుర్భర స్థితి ఇప్పుడు మొదలైంది. పదేండ్లుగా ఏనాడు తలెత్తని, నగర వాసులు కలలో కూడా ఊహించని కరువు.. ఇప్పుడే ఎందుకొచ్చింది..? ఎవరు తెచ్చారు..?
దినదినం నీటి కష్టాలు రెట్టింపవుతున్నాయి. గ్రేటర్ ప్రజలు నీళ్ల కోసం అల్లాడిపోతున్నారు. మహానగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కడ చూసినా బిందెలు, క్యాన్లతో ప్రజలు నీటి కోసం వెళ్లే సంఘటనలు దర్శనమిస్తున్నాయి. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో నగరంలో నీటి వినియోగం భారీగా పెరుగుతున్నది. దీనికి తోడు మహానగర వ్యాప్తంగా వేలాది బోర్లు అడుగంటాయి.
జలమండలి సరఫరా చేసే నీళ్లు సరిపోకపోవడంతో చాలా మంది డబ్బులు వెచ్చించి ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడుతుండటంతో.. అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రజలు ఎంత పొదుపుగా నీటిని వాడుతున్నప్పటికీ అవసరాలు తీరడం లేదు. ఇటువంటి పరిస్థితులు వస్తాయని కలలో కూడా ఊహించలేదని మహిళలు చెబుతున్నారు. నీటి సరఫరా సమయం తగ్గించడమే కాకుండా లో ప్రెషర్తో నీటిని విడుదల చేయడం వల్ల సరిపోవడం లేదని తెలుపుతున్నారు. ప్రభుత్వం స్పందించి నీటి కష్టాలు తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
– సిటీ నెట్వర్క్, ఏప్రిల్ 7 ( నమస్తే తెలంగాణ )
అంబర్పేట నియోజకవర్గం ప్రజలు తాగునీటికి తంటాలు పడుతున్నారు. అవసరాల కోసం బస్తీల్లో ఉండే బోర్లు, ప్రైవేటు వాటర్ ట్యాంకర్లపై అధారపడుతున్నారు. నారాయణగూడ, బర్కత్పుర, విజ్ఞాన్పురి, శివం, అడిక్మెట్, అంబర్పేట సెక్షన్లు ఉన్నాయి. ఎండాకాలం ప్రారంభం కావడంతో చాలా చోట్ల నీటి సరఫరాలో లోఫ్రెషర్ మొదలైంది.
తాగడానికి నీరులేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాచిగూడ డివిజన్లోని నింబోలిఅడ్డా, మౌలానా ఆజాద్నగర్, చప్పల్బజార్ మసీదు లేన్, వెంకటేశ్వరనగర్, కుడ్బిగూడ, మయనార్పట్టి తదితర బస్తీలలో లోఫ్రెషర్తో నల్లా నీళ్లు వస్తున్నాయని ఆయా బస్తీల ప్రజలు తెలిపారు. నల్లకుంటలోని ఇందిరానగర్, గోల్నాక కూరగాయల మార్కెట్ ప్రాంతాలు, గోల్నాకలోని నెహ్రూనగర్, అడ్డీ ఖార్జానా, శాస్త్రినగర్, న్యూకమలానగర్, అంబర్పేటలోని ఆజాద్నగర్ ప్రాంతాల్లో అరకొర నీటి సరఫరా జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొండాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో 39 ఫ్లాట్లు ఉన్నాయి. సరిఫడా నీరు రాక, బోర్లు అండుగంటి పోవడంతో రోజుకు 4 ట్యాంకర్ల (500లీటర్లు) చొప్పున నెలకు 120 కొనాల్సి వస్తుంది. ట్యాంకర్ ఖరీదు రూ.1000 నుంచి 1500 వరకు చార్జీ చేస్తున్నారు. కొత్తగూడ, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని అనేక కాలనీల్లో ఇదే సమస్య నెలకొన్నది. రోజు విడిచి రోజుకు వచ్చే నీరు మూడు రోజులకోసారి, అది కూడా తక్కువ ప్రెజర్తో స్వల్ప సమయం వదులుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
రాజేంద్రనగర్ డివిజన్లోని సులేమాన్, చింతల్మేట్, తదితర ప్రాంతాలలో తాగు నీటి సమస్యలు దాపురించాయి. సమీప ప్రాంతానికి దాదాపు 30 ఫీట్ల ఎత్తులో సులేమాన్ నగర్, చింతల్మేట్ పలు కాలనీలు ఉన్నందున వారికి 10 ఏళ్ల క్రితం గతంలో చుక్కా నీరు అందేది కాదు. ఉన్నత వర్గాల వారు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసేవారు. అట్టడుగు వర్గాల ప్రజలు రాత్రి వేళ సైతం పడిగాపులు కాస్తూ.. కింది ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకునేవారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా, 9 ఏళ్ల కిందట 30 ఫీట్ల ఎత్తులో 2 మిలియన్ లీటర్ల కెపాసిటి గల రిజర్వాయర్ నిర్మించి వాటికి కృష్ణా వాటర్ కనెక్షన్ ఇచ్చారు.
దీని నుంచి సమీపంలో గల బుద్వేల్, హైదర్గూడ, సులేమాన్ నగర్, అత్తాపూర్, కాటేదాన్, మైలార్దేవ్ పల్లి, హైదర్గూడ, పాండురంగానగర్, హుడాకాలనీ, నలందనగర్, రాధాకృష్ణకాలనీ, కృష్ణ నగర్, సిరిమల్లె కాలనీ, తదితర ప్రాంతాలలో గత వారం పది రోజులుగా నీటి సరఫరాలో ఇబ్బందులు నెలకొన్నాయి. కానీ ప్రస్తుతం పర్యవేక్షణ లేక పోవడం, పాలకులు విఫలం కావడంతో నీటి సరఫరా జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కుత్బుల్లాపూర్ డివిజన్లో ప్రతి మూడు రోజులకు ఒకసారి మంచినీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరామ్నగర్, అంబేద్కర్నగర్, వాజ్పేయ్నగర్, చింతల్, కుత్బుల్లాపూర్ విలేజ్ తదితర ప్రాంతాల్లో ప్రతి నాలుగు రోజులకు ఒకసారి సమయపాలన లేకుండా నీటిని సరఫరా చేస్తున్నారు. పద్మానగర్ ఫేస్-2, ఫేస్-1, ముద్దాపురం కాలనీ, కాకతీయనగర్ ఇతర ప్రాంతాల్లో జలమండలి నీటిపై ఆధారపడకుండా అవసరాలకు బోరు నీటిని, తాగేందుకు మినరల్ వాటర్ ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు.
జీడిమెట్ల డివిజన్లో యాదిరెడ్డి బండా, రంగారెడ్డి బండా కాలనీలు పూర్తిగా కార్మికులు, కూలీలు నివసించే ప్రాంతం. అక్కడ దాదాపుగా గత పది రోజుల నుంచి మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. సుభాష్నగర్ డివిజన్ ఎస్సీకాలనీ, శివాలయనగర్, షిర్డీ హిల్స్, జీవన్జ్యోతినగర్, సాయిబాబానగర్ తదితర ప్రాంతాల్లో మూడు రోజులకు ఒకసారి నీటి సరఫరా అవుతుంది. గత డిసెంబర్లో వాటర్వర్క్ ట్యాంకర్ల డిమాండ్ రోజుకు 30 ట్రిపుల చొప్పున ఉండగా ప్రస్తుతం రోజుకు 100 ట్యాంకర్లు సరఫరా అవుతున్నాయి.
జలమండలి ఎల్బీనగర్ డివిజన్ 10ఎ, 10బి పరిధిలో సుమారుగా 1.20 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. గతంలో గంట పాటు నీటిని సరఫరా చేసే అధికారులు ప్రస్తుతం 40 నుంచి 45 నిమిషాలు మాత్రమే లోప్రెషర్తో సరఫరా చేస్తున్నారంటూ పలు కాలనీల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎండాకాలంలోనూ నీటిని ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేశారు. ప్రస్తుతం ఎందుకు కొరత సృష్టిస్తున్నారని కాలనీవాసులు పేర్కొంటున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు బస్తీలలో వేసవి కష్టాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. రహ్మత్నగర్ డివిజన్ కార్మికనగర్లో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ఇక్కడ మూడు రోజులకోసారి నీటి సరఫరా చేస్తుండగా వేసవి నేపథ్యంలో మూడు, నాలుగు రోజులకోసారి కేవలం 45నిమిషాలు మాత్రమే నీటిని వదులుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలు ట్యాంకర్లపై, చేతిపంపులపై ఆధారపడుతూ తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డయల్ ఎ ట్యాంకర్ బుక్ చేసుకున్నా మూడు నాలుగు రోజుల తరువాత వచ్చే ఆ ట్యాంకర్లు ఇరుకైన గల్లీల్లోకి రాలేక తాగునీటి తిప్పలు తప్పడం లేదు. ఆదివారం కార్మికనగర్ హనుమాన్ టెంపుల్ గల్లీలో నీటిని అందించేందుకు వచ్చిన ట్యాంకర్ వెనక్కు వెళ్లి పోవడంతో వారం రోజులుగా నీటికోసం అల్లాడుతున్న స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సింగూరు నుంచి హైదర్నగర్ ప్రధాన రిజర్వాయర్కు నీటి సరఫరా జరిగే ప్రధాన పైప్లైన్ ధ్వంసం కావటంతో నీటి తాగునీటి ఎద్దడి నెలకొన్నది. పైప్లైన్ మరమ్మతులు చేపడుతుండటంతో గడిచిన 48 గంటలుగా గృహాలకు నీటి సరఫరాతో పాటు ట్యాంకర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సాధారణ రోజుల్లో మియాపూర్ సెక్షన్ పరిధిలో రోజుకు గరిష్ఠంగా 50 వాటర్ ట్యాంకర్లు బుకింగ్ ఉంటుండగా.. సమ్మర్ నేపథ్యంలో ఒక్క సారిగా 180కి పైగా పెరిగిపోయింది. దీంతో బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు ట్యాంకర్ల సరఫరా తీవ్ర ఆలస్యం అవుతున్నది. దీంతో మియాపూర్ ఎఫ్సీఐ కాలనీకి చెందిన చిన్నారులు చేతిపంపు నీటిని తెచ్చుకొని తాగుతున్నారు.
ఆస్మాన్ఘడ్, వైశాలినగర్, సంతోష్నగర్ రిజర్వాయర్లలో నీటి కొరత మూలంగా రెండు రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని ప్రాంతాలకు నీటిని సరఫరా చేయాల్సి ఉండగా సాంకేతిక కారణంగా సరిపోయేంత నీరు లేకపోవటంతో వినియోగదారులకు, ట్యాంకర్లకు సరఫరా చేయలేకపోతున్నారు. దీంతో బోరుబావుల నీటినే వినియోగించాల్సిన పరిస్థితి నెలకొన్నది. అయితే వైశాలినగర్ రిజర్వాయర్ ఫిల్లింగ్ కేంద్రం నుంచి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే తాగునీటిపై సింగరేణికాలనీ, రోషన్దౌలా గుడిసెవాసులు ఆధారపడి జీవిస్తున్నారు. ట్యాంకర్లు బస్తీకి రాకుంటే దాదాపు 15వేల కుటుంబాలు బిందెలను తీసుకొని తాగునీటి కోసం కాలనీలకు పరుగులు తీయాల్సిందే. శనివారం గుడిసెలకు రావాల్సిన ట్యాంకర్లు రాకపోవటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైశాలినగర్ రిజర్వాయర్ వాటర్ ఫిల్లింగ్ కేంద్రం నుంచి సాయంత్రం వరకు ట్యాంకర్లు ఒక్కటి రాకపోవటంతో, స్థానికులు జలమండలి అధికారులకు ఫోన్లు చేసి ఆలసిపోయారు. ట్యాంకర్ల సంఖ్య పెంచి తమ తాగునీటి కష్టాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
చైతన్య బస్తీలో తాగునీరు లోప్రెషర్ వస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. మా బస్తీపై చిన్నచూపు చూస్తున్నారు. వారానికి రెండు సార్లు సరఫరా కావాల్సిన నీరు కాకపోవడంతో, వచ్చినా.. లోప్రెషర్తో రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నీరు సరిపోక పవర్ బోర్ల వద్దకు వెళితే అవి పనిచేయవు. వాటికి మరమ్మతులు చేయడాన్ని అధికారులు విస్మరించారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు మా ఇబ్బందులను పట్టించుకుని మంచినీటి సమస్యను తీర్చాలి.
– నాగరాణి, గృహిణి, మూసాపేట
ఒకప్పుడు మంచినీటి కోసం పబ్లిక్ నల్లాల వద్దకు వెళ్లి లైన్లో బిందెలను పెట్టి నీళ్లు పట్టుకునేది. గత ప్రభుత్వం ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇంటింటికి నల్లాలను వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అంతకంతకు నీటి కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. కేవలం 40 నిమిషాలు మాత్రమే నీటిని వదలడంతో పాటు వాటర్ ప్రెషర్ తగ్గడంతో కాలనీలో సరిపడా అందక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొంతమంది మోటార్లను పెట్టుకోవడంతో సమస్య తీవ్రంగా మారుతుంది. ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.
– చంద్రమ్మ, ఇజ్జత్ నగర్ వీకర్ సెక్షన్ కాలనీ
మూడు, నాలుగు రోజుకోసారి నల్లా నీళ్లు ఇడుస్తున్నారు. అదికూడా 40 నిమిషాలు మాత్రమే. హనుమాన్ టెంపుల్ గల్లీ చివరలో ఉన్న మాకు చుక్క నీరు రావడం లేదు. దీంతో ట్యాంకర్ బుక్ చేసుకున్నాం. బస్తీలోకి వచ్చిన ట్యాంకర్ గల్లీలోకి రాలేక వెనక్కి వెళ్లిపోయింది.
– వెంకటేశ్, రహ్మత్నగర్
రోజు విడిచి రోజు వచ్చే నల్లా నీరు మూడు రోజులకోసారి వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. తక్కువ ఒత్తిడితో కేవలం 20 నిమిషాలు మంచినీళ్లు వదలడంతో నీటి కష్టాలు తప్పడం లేదు. ఎప్పుడో కాలనీ ఏర్పడిన కొత్తలో నీటి కష్టాలను చూశాం. మళ్లీ దశాబ్దం తర్వాత నీటి ఇబ్బందులు పడుతున్నాం. మిషన్ భగీరథ ఏర్పాటైన నాటి నుంచి నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాలేవు. ప్రస్తుతం అర్ధరాత్రి వదులుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
– రమేశ్ ప్రేమ్నగర్, బీ బ్లాక్
నీరు రాక.. పదిరోజులాయే..!
పది రోజుల నుంచి మంచినీరు రావడం లేదు. అన్నీ అవసరాలకు నాలుగు రోజులకు ఒకసారి వచ్చే నీటిని పట్టుకొని తీర్చుకుంటున్నాం. ఇప్పుడు ఇంట్లో అవసరాలు తీర్చుకునేందుకు కూడా నీటి సుక్క లేదు. కూలీనాలి పనులకు వెళ్లి వచ్చే సారికి ఇంటి వద్ద నీటి కొరతతో మనశ్శాంతి లేకుండా పోతుంది. పండుగలు వచ్చే కాలం.. ఇలాగే నీటి కొరత ఏర్పడితే మా పరిస్థితి ఏంది.
-సత్తెమ్మ, యాదిరెడ్డిబండ, పేట్బషీరాబాద్
ఇంట్లో అవసరాలు తీర్చుకోవడంతో పాటు తాగేందుకు జలమండలి నీరే దిక్కుగా మారింది. కాలానీల్లో ఒక మోటర్ ఉండేది. అది మరమ్మతులకు నోచుకోకపోవడంతో మూలనపడింది. ఇప్పుడు గత వారం, పది రోజుల నుంచి నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కనీసం బాత్రూంలో నీటిని వాడుకునేందుకు కూడా అరకొరగా సరిపెట్టుకుంటున్నాం.
– వంశీ, జీడిమెట్ల
మునుపెన్నడూ నీళ్ల కోసం ఇంత ఇబ్బందులు లేకుండే. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి నల్లా వచ్చింది. రోజు విడిచి రోజు నీళ్లు వస్తే తమకు నీళ్ల గోసనే తెలియకపోయేది. ఇప్పుడేమైందో ఏమో కానీ పది రోజుల నుంచి నీళ్లు రాకపోతే చాలా కష్టంగా ఉంది. మాకు నల్లా నీల్లే దిక్కు. ఇప్పుడు నల్లాలు రాకపోతే ఎక్కడికిపోవాలో తెలియడంలేదు.
-రాములు, కుత్బుల్లాపూర్
కనీసం ఐదారు బిందెల నీరు కూడా రావడం లేదు. తాగు నీటిపై పర్యవేక్షణ కరువైంది. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. ప్రైవేటుగా కొనాల్సి వస్తుంది. దాదాపు 8 ఏళ్లు ఎన్నడూ నీటి కొరత లేదు. కాంగ్రెస్ రాకతోనే మొదలైంది. ఇది పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం.
– ఎండీ సమీనా సుల్తానా, సులేమాన్ నగర్