Drinking Water | కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 6 : కేపీహెచ్బీ కాలనీలో తాగునీటి కోసం ప్రజల తండ్లాట మొదలైంది. కేసీఆర్ పాలనలో ఇంటింటికీ సమృద్ధిగా తాగునీటిని సరఫరా చేయడంతో.. పదేండ్లుగా ఖాళీ బిందెలతో ప్రదర్శనలు కనుమరుగయ్యాయి. అర్హులైన వారికి 20వేల లీటర్ల తాగునీటిని ఉచితంగా సరఫరా చేయడంతో పాటు ప్రజల అవసరాలకు తగ్గట్టుగా నీటిని అందించారు. దీంతో మహిళలు తాగునీటి కోసం ఎదురుచూసే అవసరమే లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలే అయ్యింది. అప్పుడే ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి.
గత కాంగ్రెస్ పాలనలో కనిపించిన ఖాళీ బిందెల ప్రదర్శనలు మళ్లీ పునరావృతమవుతున్నాయి. కేపీహెచ్బీ కాలనీ 3వ రోడ్డులోని ఈడబ్ల్యూఎస్ గృహాల్లో మూడ్రోజులుగా తాగునీరు సరఫరా చేయకపోవడంతో స్థానికులు తల్లడిల్లుతున్నారు. మూడ్రోజుల కిందట నిర్దేశిత సమయం ప్రకారం కాకుండా కొద్ది సమయమే నీటిని సరఫరా చేశారు. ఇదేమని అడిగితే పైనుంచి నీటి సరఫరా తక్కువగా ఉందని మరుసటిరోజు సరిపడా వస్తాయని చెప్పడంతో ప్రజలు ఎదురుచూశారు.
తీరా శనివారం నీటి సరఫరా చేసినప్పటికీ పట్టుమని పది నిమిషాలు కూడా రాకపోవడంతో ప్రజలంతా ఆందోళన చెందారు. సమీపంలోని వాటర్ ట్యాంకర్ వద్దకు వెళ్లి అధికారులను నిలదీశారు. కాలనీ ప్రజలకు సరిపడా నీళ్లు రాలేదని అదనంగా మరికొద్దిసేపు సరఫరా చేయాలని ఆందోళనకు దిగారు. వాటర్ ట్యాంకర్లతో నీటిని విక్రయిస్తుండగా అడ్డుకున్నారు. స్థానికులకు నీరు ఇచ్చిన తర్వాతే బుకింగ్ చేసుకున్న వారికి సరఫరా చేయాలని బైఠాయించారు. రంగంలోకి దిగిన జలమండలి అధికారులు.. నీటిని సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు.