గోల్నాక, జనవరి 21 : నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థానికులను వేధిస్తున్న డ్రైనేజీ వ్యవస్థను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందుకు సంబంధించి కొత్త పైపులైన్ల వ్యవస్థ ఏర్పాటు పనులను వేగవంతం చేశామని ఆయన తెలిపారు. శనివారం అంబర్పేట డివిజన్ ఓవైసీనగర్లో రూ.9 లక్షల అంచనా వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైపులైన్ పనులను స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో భవిష్యత్లో ఎలాంటి మురుగు సమస్య తలెత్తకుండా ప్రణాళికా బద్ధంగా పనులు చేపడుతున్నామని అన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో మౌలిక వసతుల్లో భాగంగా మంచినీటి, డ్రైనేజీ పైపులైన్ల ప్రక్షాళన, రహదారుల అభివృద్ధి, పార్కుల సుందరీకరణ. కమ్యూనిటీ హాళ్ల అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలలో వసుతుల పనులు ముమ్మరం చేశామని అన్నారు.
కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్ మాట్లాడుతూ.. డివిజన్లో మౌలిక వసుతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అనంతరం బస్తీల్లో పర్యటించిన ఎమ్మెల్యే స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. దృష్టికి వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిచారు. ఈకార్యక్రమంలో జలమండలి ఏఈ మాజీద్, వర్క్ఇన్స్పెక్టర్ రమేశ్, అంబర్పేట డివిజన్ బీటీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్ముదిరాజ్తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
అభ్యర్థులకు స్టడీమెటీరియల్ అందజేత..
తెలంగాణలో ప్రస్తుతం కొలువుల కుంభమేళా కొనసాగుతోందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శనివారం గోల్నాక క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రూప్1, గ్రూప్-2, 3,4 పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతుందన్నారు. యువత బంగారు భవిష్యత్తే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధ మవుతున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ కష్టపడి చదివి తమ కలలను నిజం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు జంపాల రాజేశ్, జీనియస్ పబ్లికేషన్ డైరెక్టర్ రఘు, దీపిక, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.