మహానగరంలో పేదలకు సొంతింటి కలను సాకారం చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం మరోమారు ఇండ్లను కేటాయించనున్నది. ఇప్పటికే తొలివిడతలో 11,700 మందికి డబుల్ ఇండ్లను కేటాయించగా, ఈ నెల 15న రెండో విడత లబ్ధిదారుల ఎంపికకు రంగం సిద్ధమైంది. గ్రేటర్లోని 24 నియోజకవర్గాల్లో మొత్తం 13, 300 మందికి డబుల్ ఇండ్లను కేటాయించనున్నారు. హైదరాబాద్ కలెక్టరేట్లో పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు లబ్ధిదారుల ఎంపికలో రిజర్వేషన్ల విధానాన్ని పాటిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 500పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులను ఆన్లైన్ లాటరీ విధానం ద్వారా ఎంపిక చేసి ర్యాండమైజేషన్ పద్ధతిలో ఇండ్లను కేటాయిస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
– సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజక వర్గాల వారీగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపును ఎన్ఐసీ వెబ్ పోర్టల్ సహాయంతో లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం అధికారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు.
మొదటి దశ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు ప్రక్రియ ఇదే ఆన్లైన్ పోర్టల్ ద్వారా 15 నియోజక వర్గాలలో విజయవంతమైందని, అదే స్ఫూర్తితోనే రెండో దశ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు మొత్తాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 15న జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆన్లైన్ లాటరీ విధానం ద్వారా లబ్ధిదారులకు ఇండ్లు కేటాయిస్తామన్నారు. ఎలాంటి రాజకీయాలకు ఆస్కారం లేకుండా, పూర్తిగా పారదర్శకంగా లాటరీ విధానం ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగుల వారీగా రిజర్వేషన్లు పాటిస్తూ లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని తెలిపారు. నియోజకవర్గానికి 500 చొప్పున లబ్ధిదారులను ఎంపికచేస్తున్నామని పేర్కొన్నారు.