బడంగ్పేట, జనవరి 11: డ్రగ్ మహమ్మారికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు, యువతకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. బుధవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్వైఆర్ కన్వెన్షన్లో మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, షీ టీమ్ డీసీపీ షేక్ సలీమా తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. డ్రగ్స్పై అవగాహనకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మహిళల భద్రత, డ్రగ్స్ నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. ఒకప్పుడు కళాశాలల్లో ర్యాగింగ్ ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీసుకున్న చర్యలతో ర్యాగింగ్ను కంట్రోల్ చేశామన్నారు. ప్రస్తుతం డ్రగ్స్ను పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రతి కాలేజీలో డ్రగ్స్పై కౌన్సిలింగ్ ఇచ్చేందుకు నిపుణులను నియమించుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల ప్రలోభానికి గురై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్ ప్రమాదకర వ్యసనమన్నారు. డ్రగ్స్కు అలవాటుపడిన విద్యార్థులు చదువులు మానేసి సర్వస్వం కోల్పోతారని తెలిపారు. తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ తీసుకోనని ప్రతినబూనాలన్నారు. కళాశాలల్లో విద్యార్థినులు ఏ రకమైన వేధింపులకు గురైనా నిర్భయంగా షీ టీమ్ సహాయం తీసుకోవాలని సూచించారు.
అనంతరం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణ విజన్ ఉన్న గొప్ప నాయకుడని అన్నారు. రాష్ట్రంలో భద్రత, ప్రశాంతత, అభివృద్ధి కోసం అన్ని రకాలుగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్ అతిపెద్ద సమస్యగా మారిందన్నారు. విద్యార్థులను, యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ మాఫియా గ్యాంగ్లు పని చేస్తున్నాయన్నారు. మత్తు పదార్థాలకు బానిసలైన కాలేజీ విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల గురించి ఎటువంటి సమాచారం ఉన్నా.. పోలీసులకు తెలియజేయాలన్నారు. విద్యార్థినులు, యువతులు ఏదైనా సమస్య ఉంటే షీ టీమ్ను సంప్రదించాలని సూచించారు.
ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే కుటుంబం మొత్తం నష్టపోతుందని సూచించారు. మత్తుకు యువత దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ అవగాహన మోటివేషన్ స్పీకర్స్ నైనా జైస్వాల్, వంశీ కృష్ణారెడ్డి, కృష్ణ చైతన్య, గ్రంథాలయ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు గజ్జెల రామచంద్రం, పద్మ భాస్కర్రెడ్డి, బొక్క జంగారెడ్డి, మీర్పేట, బాలాపూర్, పహడీషరీఫ్ ఇన్స్పెక్టర్లు మహేందర్రెడ్డి, భాస్కర్, కిరణ్కుమార్, తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.