Telangana | మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 21: ఎన్నికల నియమావళి ప్రకారం ఎవరూ కూడా రూ.50వేల కంటే ఎక్కువ నగదుతో ప్రయాణం చేయొద్దని, సరైన పత్రాలు లేకుండా వెళ్తే సీజ్ చేస్తామని జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లా గ్రీవెన్స్ కమిటీ సభ్యులతో శనివారం కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పోలీసులు, ఎఫ్ఏఎస్టీ బృందాలు తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర వస్తువులను పరిశీలించి, విడుదల చేసేందుకు జిల్లాస్థాయి గ్రీవెన్స్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న నగదును విడుదల చేసేందుకు వచ్చిన ఫిర్యాదు, దరఖాస్తులను కమిటీ కన్వీనర్, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ మూర్తి, సభ్యులు డీటీవో నర్సింహారావు, డీఆర్డీవో పద్మజారాణి పరిశీలిస్తారని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఎఫ్-12లో ఉంటుందని, ఆధారాలు లేకుండా ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్లొద్దని, దొరికిన నగదును సీజ్ చేసి, డిపాజిట్ చేస్తామన్నారు. ఎన్నికలకు సంబంధంలేదని, సరైన ఆధారాలు చూపితే తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు. అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, వివాహం ఇతర అవసరాలకు తీసుకెళ్లే వారు సరైన పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలన్నారు. సీజ్ అయిన నగదు కోసం గ్రీవెన్స్ కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ మూర్తి నంబర్ 91001 15724, సభ్యులు నర్సింహారావు 77999 34204, పద్మజారాణి 73309 99280లో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కతరించాలి
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలని, రాజకీయ పార్టీల అభ్యర్థుల నుంచి వచ్చే ఫిర్యాదులకు తీసుకున్న చర్యలపై లిఖిత పూర్వకంగా సమాధానం అందించాలని కలెక్టర్ గౌతమ్ సూచించారు. శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, డీజీపీ అంజనీకుమార్, ఉన్నతస్థాయి అధికారులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ నోడల్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సమావేశాలు, సభలు నిర్వహించుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల నుంచి సువిధ యాప్ ద్వారా, ఆన్లైన్లో వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి, అనుమతులు మంజూరు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో జరిగే ఎన్నికల ప్రచారంలో వినియోగించే ఆడియో, వీడియోలను పరిశీలించాలని, ఎంసీఎంసీ ధ్రువీకరించాలన్నారు.
ప్రతిరోజు ఎంసీఎంసీ, సువిధ యాప్ ఆన్లైన్ దరఖాస్తులపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. తనిఖీల్లో పట్టుబడిన నగదు, బంగారం సీజ్ చేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలపై క్షేత్రస్థాయి అధికారులకు అవగాహన కల్పించాలన్నారు. నగదు, బంగారం వంటి వివరాలు, ఎక్కడ విజ్ఞప్తి చేసుకోవాలి అనే అంశాలను తెలియజేస్తూ రసీదు ఇవ్వాలన్నారు. నగదు, బంగారం రూ.10లక్షల కంటే తక్కువైతే వెంటనే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్కు అప్పగించాలని, అంతకంటే ఎక్కువైతే ఐటీ అధికారులకు అప్పగించాలన్నారు. సంబంధిత వ్యక్తులకు అప్పీల్ అనంతరం విడుదల చేసే నగదు వివరాలను సమాచార మాధ్యమాలకు వెల్లడించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల విధులు నిర్వహించే ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్సు, వీడియో సర్వేలెన్స్ బృందాలతోపాటు తప్పనిసరిగా వీడియో కెమెరా సౌకర్యం ఉండాలని, ప్రతి తనిఖీ వీడియో కెమెరాలో రికార్డు చేయాలన్నారు. జిల్లాలో ఓటరు స్లిప్పులు త్వరగా ముద్రించి, పంపిణీ చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల నిర్వహణపై వస్తున్న వదంతులు, అపోహలను నివృత్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువ పోలింగ్ నమోదైన కేంద్రాలపై అధిక దృష్టి సారించి, పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని ఎన్నికల అధికారులు, నోడల్ అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఈవీఎంల తరలింపునకు ఏర్పాట్లు
జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు ఈవీఎంల తరలింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాం నుంచి ఆయా కేంద్రాలకు కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లు తరలించే ఏర్పాట్లను గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆన్లైన్ ద్వారా మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. శనివారం ఉదయం వారి సమక్షంలో ఈవీఎం గోదాం తెరిచి, ర్యాండమైజేషన్ ప్రకారం ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేశామన్నారు. వాటిని జిల్లాలోని కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాలకు తరలించి, భద్రపరుస్తామన్నారు. అనంతరం ఎన్నికల పరిశీలకుడి పర్యవేక్షణలో రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.