రంగారెడ్డి, మే 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నో సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో పరిష్కారం లభించని, సాధించుకోలేని పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలవుతున్నాయి. ధరణి పోర్టల్ వేదికగా మ్యుటేషన్లు శరవేగంగా పరిష్కారం అవుతున్నాయి. అయితే, ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో భూ దందాలు అనేకం జరిగి ఎంతో మంది భూ పట్టాదారులు లెక్కలేనన్ని సమస్యల్లో ఇరుక్కుపోయారు. భూ సమస్యలతో తిప్పలు, ఇబ్బందుల్లో ఇరుక్కుపోయిన ఎంతో మందికి ‘ధరణి’ పరిష్కారం చూపుతున్నది. రంగారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని విధంగా భూ సమస్యలు లక్షల్లో ఉన్నాయి. ఇలాంటి సమస్యలకు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ‘ధరణి’ పోర్టల్తో చెక్ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ విజయవంతంగా కొనసాగుతున్నది. భూ సమస్య ఎంత జఠిలమైనదైనా పరిష్కరిస్తున్నది. జిల్లాలో భూ సమస్యలు అనేకం ఉన్నప్పటికీ 97 నుంచి 98 శాతం వరకు అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభించింది. త్వరలోనే భూ సమస్యలు లేని ‘రంగారెడ్డి’ని చూడొచ్చని జిల్లా కలెక్టర్ హరీశ్ చెబుతున్నారు. ధరణిలో సమస్యలు వేగవంతంగా, సులభతరంగా, పారదర్శకంగా లావాదేవీలు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కొత్త మాడ్యూల్స్ అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు ధరణిపై అవగాహన పెంచుకొని వారి సమస్యల నిమిత్తం దరఖాస్తు చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లాలో గతేడాది డిసెంబర్ వరకు వివిధ రకాల 1,89,068 భూ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటికీ ‘ధరణి’ వేదికగా పరిష్కారం చూపింది. కాగా, జిల్లాలో పలు రకాల భూ సమస్యలకు పరిష్కారం చూపుతూ ‘ధరణి’ పోర్టల్ చెక్ పెడుతున్నది.
ధరణి లేకుంటే..దారుణమే..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయాన్ని నిలబెట్టే మహత్తర కృషిలో ముందడుగు ధరణి. నిరుపేద, నిరక్షరాస్య రైతాంగానికి తన భూమిపై పూర్తి సాధికారకమైన, చట్టబద్ధమైన భద్రత, భరోసా కల్పించే ప్రయత్నమిది. రైతుల కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడిన విజ్ఞానమిది. నిరుపేద రైతుల భూములకు రక్షణ కల్పించే ధరణి లేకుంటే.. బడుగులు, బలహీనుల భూములను తన్నుకుపోయే దుర్మార్గపు రోజులివి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సంరక్షణ చర్యల్లో భాగంగా ‘ధరణి’ అనే వేదికను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలో పేరుకుపోయిన భూ సమస్యలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ, ‘ధరణే.. మా ధైర్యం” అని నిరుపేద రైతులు గొంతెత్తి చెప్పుకునేలా నేడు ‘ధరణి’ సాహసోపేతమైన పరిష్కార చర్యలను చేపడుతున్నది. జిల్లాలోని ఒక్కొక్క మండల రెవెన్యూ కార్యాలయం ముందు రైతులు పలు భూ సమస్యలతో వందలు, వేలాదిగా బారులు తీరుతున్నారు. ఎలాంటి భూ సమస్యలకైనా ధరణి ఇట్లే పరిష్కారం చూపడంతో రైతులు తెలంగాణ ప్రభుత్వం పని తీరును, ధరణి పోర్టల్ను వేనోళ్ల కొనియాడుతున్నారు. ధరణి లేకుంటే దళారులు తమ నోట్లో మట్టి కొట్టేవారని పలువురు లబ్ధిదారులు అభిప్రాయం చెబుతున్నారు.
గతంలో అవకతవకలు జరిగేవి..
ధరణి పోర్టల్ రాక ముందు భూ రికార్డుల్లో అనేక అవకతవకలు జరిగేవి. ఎప్పుడైనా భూమిని అమ్మేటప్పుడు, కొనేటప్పుడు గాని పహాణిలు తీసుకొని చూస్తే ఒకరి భూమి ఇంకొకరి పేరుపై ఉండేది. కొంత మంది దళారులు, అవినీతికి పాల్పడే వారు భూమిని ఎవరి పేరు మీదకు కావాలంటే వారి పేరనే ఎక్కించేవారు. సీఎం కేసీఆర్ ప్రజల బాగోగులను దృష్టిలో పెట్టుకొని ‘ధరణి’ని తీసుకొచ్చి భూమికి రక్షణ కంచె వేసిండు. భూ సంస్కరణలు, భూ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది.
– చిందం సైదులు, రైతు, ఆరుట్ల
‘ధరణి’తో వివాదాలు పరిష్కారం
గతంలో రాత పద్ధతుల్లో ఉన్న రికార్డుల్లో వందలు, వేల మంది రైతులకు తెలియకుండానే అనేక మార్పులు, చేర్పులు గతంలో జరిగేవి. ఇరుగు పొరుగు వాళ్లు భూ వివాదాలతో అనేక పంచాయితీలు పెట్టుకొని ఘర్షణ దాకా పోయేటోళ్లు. వాటి పరిష్కారం కోసం కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగేటోళ్లు. ఇప్పుడు రికార్డులు డిజిటల్ చేయడమే కాకుండా, అనేక వివాదాలను పరిష్కరించారు. మున్ముందు ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ధరణి పోర్టల్ పరిష్కార మార్గానాకి వేదికైంది.
– ఆర్ల యాదయ్య, మంచాల
రెవెన్యూ వ్యవస్థలో ‘ధరణి’ విప్లవాత్మకం
రెవెన్యూ విభాగంలో పేరుకుపోయిన పలు సమస్యలకు ‘ధరణి’ విప్లవాత్మక మార్పులు తెస్తుంది. సమస్యల్లో ఇరుక్కుపోయిన ఎంతో మందికి ‘ధరణి’ మేలు చేస్తున్నది. ఇందులో స్లాట్ బుకింగ్ల నుంచి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, పాసు పుస్తకాలు అందజేయడం మొదలైనవన్నీ చకచకా సాగిపోతాయి. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగే ప్రసక్తి ధరణి పోర్టల్లో లేదు. భూ వివరాలను ‘ధరణి’లో పొందుపర్చుకుంటే అవకతవకలు జరిగే అవకాశాలు ఉండవు. ఈ ధరణి వేదిక నుంచి చాలా సులువుగా, అర్ధగంటలో పట్టా పొందేందుకు ఆస్కారం ఉంది.
– కర్ర అనిత, మండల రెవెన్యూ అధికారి, మంచాల మండలం
పైసా ఖర్చు లేకుండా..
భూముల సమస్యల పరిష్కారానికి సర్కార్ తెచ్చిన ధరణితో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇంతకుముందు పాసు బుక్కులో తప్పు ఒప్పులు సరిచేసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి పోతే పైసలు ఇచ్చిందాకా పనులు చేసేటోళ్లు కాదు. పైసలు తీసుకున్నా కూడా రోజుల తరబడి ఆఫీస్ చుట్టూ తిరిగి ఇబ్బందులు పడ్డాం. రైతుల కష్టాలు తీర్చేందుకు కేసీఆర్ ధరణి తెచ్చి ఎవరికి రూపాయి ఇచ్చే పనిలేకుండా అంతా ఆన్లైన్తో పని చేయించడం మంచి నిర్ణయం.
– పి. పర్వతాలు, కుమ్మరిగూడ(షాబాద్)