హైదరాబాద్: డీజీపీ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగుల సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డీజీపీ అంజనీ కుమార్ ఇవాళ తన చేతుల మీదుగా ఈ శిబిరాన్ని ప్రారంభించారు. వాసవీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి అడిషనల్ డీజీ అభిలాష బిస్త్, డీఐజీ రమేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ వైద్య శిబిరానికి డీజీపీ కార్యాలయం, ఇంటెలిజెన్స్, సీఐడీ, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్, కమ్యూనికేషన్స్ తదితర విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీజీపీ మాట్లాడుతూ.. ప్రజలకు ఉత్తమ సేవలంచించాంటే ఉద్యోగులు, అధికారులకు మెరుగైన ఆరోగ్యం కూడా ప్రధానమని పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణకై ప్రతి ఒక్కరు విధిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. డీజీపీ కార్యాలయంలో ఉచిత వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేయడంపట్ల వాసవి హాస్పిటల్ యాజమాన్యాన్ని డీజీపీ అంజనీ కుమార్ అభినందించారు. రాయల్ పెర్ల్ స్కాల్ ఇన్స్టిట్యూట్ వాసవి హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగే ఈ రెండు రోజుల వైద్య శిబిరంలో 11 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో వాసవి హాస్పిటల్ వైద్యులు నారాయణ జానకి రామ్, శిల్పి భాటియా శర్మ, అవినాష్, శివ కుమార్, భవ్య, సీమలతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.