బడంగ్పేట, ఫిబ్రవరి 6 : తెలంగాణ రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ నుంచి మహేశ్వరం గేట్ వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను ఆదివారం రాత్రి మంత్రి ప్రారంభించి మాట్లాడారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ కోసం రూ.5.50 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం రూ.1.8కోట్లతో తుక్కుగూడ నుంచి మహేశ్వరం వరకు లైటింగ్ను ప్రారంభించామని తెలిపారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్తో ప్రమాదాలు జరుగకుండా ఉండటానికి అవకాశం ఉందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కాలనీలకు రూ.1200 కోట్లతో నీటి సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. నగరాలతో పాటు గ్రామాలకు నీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు.
నీటి కష్టాలు లేకుండా చేశారన్నారు. నీటి సమస్య ఉత్పన్నం కాకుండా ప్రతి ఇంటికి మంచి నీళ్లు అందిస్తున్న ఘనత కేసీఆర్దే అన్నారు. 24 గంటల విద్యత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. పరిశ్రమలకు విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. దీంతో ఇతర రాష్ర్టాల నుంచి కంపెనీలు పెట్టడానికి తెలంగాణకు వస్తున్నారని గుర్తు చేశారు. హైదరాబాద్ సిటీ ఏ విధంగా అభివృద్ధి అవుతుందో శివారు గ్రామాలను కూడా అదే విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రాంతాలను నూతన హంగులతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకట్రామ్, వైస్ చైర్మన్ భవానీవెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు, సుమన్, రవినాయక్, కొప్పుల పద్మాశివయ్య, చప్పిడి రాజు, నాయకులు తదితరులు ఉన్నారు.