మేడ్చల్ రూరల్, నవంబర్ 21: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ర్టాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరు మద్దతుగా నిలిచి బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ మండలంలోని బండమాదారం, నూతన్కల్, కోనాయిపల్లి, మైసిరెడ్డిపల్లి, లింగాపూర్, బర్మాజీగూడ, అక్బర్జాపేట, రాజబొల్లారం, ఘన్పూర్, పూడూర్, గోసాయిగూడ గ్రామాల్లో మంగళవారం మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రణాళికా బద్ధంగా తెలంగాణను అభివృద్ధి చేసి.. దేశంలోనే అగ్రగామిగా నిలిపారని తెలిపారు. నేడు ఏ గ్రామంలో చూసినా సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీలు, వీది దీపాలు, విశాలమైన లింకు రోడ్లు ఏర్పడ్డాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందించిన ఇంటింటికీ తాగునీరు, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, దళితబంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్.. తదితర పథకాలతో ఇంటింటికీ లబ్ధి చేకూరిందని తెలిపారు.
ఈ ఎన్నికల్లో విజయం సాధించి.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సీఎం కేసీఆర్ రైతుబంధును ఎకరాకు సంవత్సరానికి రూ.12 వేలు అందించబోతున్నారని తెలిపారు. రెండు వేల పింఛన్ను మూడు వేలు చేస్తారని, అర్హులైన ఆడబిడ్డలకు రూ.3 వేల ఆర్థిక సహాయం, వంట గ్యాస్ రూ. 400లకే ఇవ్వనున్నామని తెలిపారు. ఇలాంటి పథకాలు అందించే సత్తా ఎవరికీ లేదన్నారు.
ఎన్నికలు వచ్చాయని ఎవరో వచ్చి చెప్పిన మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రజలకు చేసిందేమి లేదన్నారు. భగవంతుడి దయతో తనకు అన్ని సమకూరాయని, సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రి పదవి చేపట్టానని, ఈ ఎన్నికల్లో గెలిపించి ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని, కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజితా రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయనందరెడ్డి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నందారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు విజయనందరెడ్డి, మాజీ జడ్పీటీసీ శైలజా హరినాథ్, వైఎస్ ఎంపీపీ వెంకటేశ్, సర్పంచులు శ్యామలా ప్రభాకర్రెడ్డి, కవితా జీవన్, శేఖర్, కరుణాకర్, లక్ష్మీ సంజీవ, మాంగ్యా నాయక్, బాబా యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్లు రణదీప్రెడ్డి, సురేశ్ రెడ్డి, నాయకులు రాజమల్లారెడ్డి, ప్రభాకర్రెడ్డి, అంతిరెడ్డి, భాగ్యరెడ్డి, నారాయణగౌడ్, దర్శన్, కుమార్, రవి నాయక్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.