కీసర/ మేడ్చల్ రూరల్ / శామీర్పేట / ఘట్కేసర్ రూరల్, జూన్ 15 : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, కీసర, ఉమ్మడి మీర్పేట శామీర్పేట, ఘట్కేసర్ మండలాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఎగురవేసి గ్రామ సభలు నిర్వహించారు. పల్లె ప్రగతిలో భాగంగా సాధించిన ప్రగతిని ఫ్లెక్సీలు, పోస్టర్లు అతికించడంతో పాటు ప్రగతి నివేదిక, సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను పంచాయతీ ఆవరణలో నిర్వహించిన సభలో చదివారు. అలాగే గ్రామాల్లోని డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, హరిత నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలను గ్రామ ప్రజలతో కలిసి ప్రజా ప్రతినిధులు, అధికారులు ర్యాలీగా వెళ్లి సందర్శించారు. అన్ని పంచాయతీల్లో పంచాయతీ సిబ్బంది, కార్మికులను పారిశుద్ధ్య సిబ్బందికి సర్టిఫికెట్లను అందజేసి సన్మానించారు.