సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనుసరించి నగర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఎన్నికల అధికారులను ఆదేశించారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బ్యాంకు, ఆర్బీఐ, ఇన్కం ట్యాక్స్, విజిలెన్స్, ఆర్టీఏ, ఎన్సీబీ అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో నగదు, లికర్ తరలింపును అడ్డుకోవడానికి పార్సిల్, కొరియర్, ట్రైన్ చెకింగ్, సరిహద్దుల వద్ద నిఘా పెట్టాలని రోనాల్డ్ రోస్ తెలిపారు. అన్ని వైన్ షాపుల వద్ద సీసీ కెమెరాలను అమర్చి.. కంట్రోల్ రూం ద్వారా మానిటరింగ్ చేయాలన్నారు. జిల్లాలో ఎక్సైజ్ శాఖ ద్వారా హాట్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని గోడౌన్లను చెక్ చేసి సీసీ కెమెరాలను అమర్చాలన్నారు. 18 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ల ద్వారా తనిఖీలు చేపట్టాలని రోనాల్డ్ రోస్ సూచించారు.
ఆర్బీఐ, పోస్టాఫీసు ద్వారా గత ఆరు నెలల్లో ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు జరిగిన వివరాలను అందించాలని ఎన్నికల అధికారి తెలిపారు. యూపీఐ (గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం) ద్వారా ఒకే అకౌంట్ నుంచి ఎకువ అకౌంట్లకు నగదు బదిలీలు జరిగిన వాటి వివరాలను అందించాలని తెలిపారు. రూ. 10 లక్షలకు మించి ఉన్న నగదు లావాదేవీలపై ఇన్కంట్యాక్స్ శాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బ్యాంకులు రూ.10 లక్షలకు మించి నగదు లావాదేవీలు, ఎకువ మొత్తంలో నగదు బదిలీ వివరాలను అందించాలని తెలిపారు. బ్యాంకుల ద్వారా నగదు మూలాలను గుర్తించి సమాచారం అందించాలని తెలిపారు. ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసే వాహనాలపై నిఘా, కెమెరాలను ఏర్పాటు చేయాలని రోనాల్డ్ రోస్ తెలిపారు.
అక్రమంగా తరలించే నగదును సీజ్ చేసి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ సెల్కు సమాచారమివ్వాలని రోనాల్డ్ రోస్ తెలిపారు. ఆదాయపన్ను శాఖ అధికారులు అనుమానిత నగదు లావాదేవీలపై పూర్తి విచారణ చేయాలన్నారు. విజిలెన్స్ ద్వారా అక్రమ నగదుపై నిఘా ఉంచాలని సూచించారు. ఆర్టీఏ అధికారులు 18 చెక్ పోస్టులలో తమ సిబ్బందిని నియమించాలని తెలిపారు. సరిహద్దు ప్రాంతాలైన పెద్ద అంబర్పేట, ఘట్కేసర్ నుంచి తరలిస్తున్న డ్రగ్స్పై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. సిగరేట్లు, గంజాయి సరఫరా ప్రదేశాలలో నిఘా ఉంచాలన్నారు.
ఇంటెలిజెన్స్ అధికారులు ఇండస్ట్రీయల్ యూనిట్లు, గోడౌన్ ప్రదేశాలలో తనిఖీలు చేపట్టాలని సూచించారు. అక్రమంగా తరలిస్తున్న బంగారం, వెండిపై నిఘా ఉంచాలని, ఈ- వేబిల్స్, ఎఫ్ఎంసీజీ ద్వారా హోల్సేల్ మారెట్లలో తనిఖీలు చేపట్టాలన్నారు. జిల్లా గ్రీవెన్స్ సెల్ ద్వారా పట్టుబడిన నగదుకు సంబంధిత వాహనాలను రికార్డింగ్ చేసి.. సమయం, వెహికిల్ నంబర్ను పొందుపర్చాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఈఓ అనుదీప్ దురిశెట్టి, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, అడిషనల్ సీపీ విక్రమ్సింగ్ మాన్, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, అడిషనల్ కమిషనర్ ఎలక్షన్ శంకరయ్య, నోడల్ అధికారులు, బ్యాంక్, ఆదాయపన్ను శాఖ, ఈడీ, ఆర్టీఏ శాఖల అధికారులు పాల్గొన్నారు.