గ్రేటర్లో డెంగీ జ్వరం మరోసారి దడ పుట్టిస్తోంది. నగరంలో దోమల వృద్ధి కారణంగా డెంగీ బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో గడిచిన సంవత్సర కాలంలో గ్రేటర్ వ్యాప్తంగా సుమారు 3000కు పైగా డెంగీ కేసులు నమోదైనట్లు అధికారిక రికార్డుల ద్వారా తెలుస్తోంది. గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు 315 డెంగీ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే రోగులకు బస్తీ దవాఖానల్లో డెంగీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పేషెంట్ పరిస్థితి తీవ్రంగా ఉంటే గాంధీ, ఉస్మానియా, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్కు రెఫర్ చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.వెంకటి, రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డా.వెంకటేశ్వర్లు వెల్లడించారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో డెంగీ జ్వరం మరోసారి విజృంభిస్తున్నది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో డెంగీ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దోమల వృద్ధి కారణంగా డెంగీ బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. గడిచిన సంవత్సర కాలంలో గ్రేటర్ వ్యాప్తంగా సుమారు 3000కు పైగా డెంగీ కేసులు నమోదైనట్లు అధికారిక రికార్డుల ద్వారా తెలుస్తున్నది. డెంగీ నివారణ చర్యల్లో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి బస్తీ దవాఖాన, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా దవాఖానలతో పాటు గాంధీ, ఉస్మానియా, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో మెరుగైన చికిత్సను అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గడిచిన వారం పది రోజులుగా మరోసారి గ్రేటర్లో డెంగీ కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తున్నది.
బస్తీ దవాఖానల్లో అందుబాటులో వైద్యం
డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలకు సంబంధించిన వైద్య పరీక్షలను అన్ని బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.వెంకటి, రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డా.వెంకటేశ్వర్లు వెల్లడించారు. బస్తీ, పీహెచ్సీలలో పూర్తిస్థాయి వైద్యం అందుబాటులో ఉన్నదని, రోగి పరిస్థితి తీవ్రంగా ఉండి, దవాఖానలో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే గాంధీ, ఉస్మానియా లేదా నల్లకుంట ఫీవర్ హాస్పిటల్కు రెఫర్ చేస్తున్నట్లు తెలిపారు.