సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): అనుమతి లేకుండా ఔషధాలు తయారు చేస్తున్న ఓ ఫార్మా కంపెనీపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ.23.93 లక్షల విలువజేసే ఔషధాలు, తయారీకి వినియోగించే ముడి పదార్థాలను సీజ్ చేశారు. డీసీఏ డీజీ వి.బి.కమలాసన్రెడ్డి కథనం ప్రకారం… జీడిమెట్లలోని సుభాష్నగర్లో ‘ఒవైడ్ ఫార్మాకెమ్ ప్రై.లి.’ పేరుతో ఔషధాలను తయారు చేస్తున్నారు. అయితే, అక్కడ తయారు చేస్తున్న ఔషధాలకు డీసీఏ నుంచి ఎలాంటి అనుమతి లేదు.
సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు ఈ నెల 3, 4తేదీల్లో ఒవైడ్ ఫార్మాకెమ్పై దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఔషధాల తయారీకి సంబంధించిన 19 డ్రమ్ములను గుర్తించారు. వాటిలో 87 కిలోల ఇట్రాకనజోల్, 35 శాతం పెల్లెట్స్, 800 కిలోల యాక్టివేటెడ్ చార్కోల్ 250 ఎంజీ, సిమెథికన్ 80 ఎంజీ పెల్లెట్స్ ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు రూ.23.93లక్షల విలువజేసే ఈ ఔషధాలకు సంబంధించిన 19 డ్రమ్ములను సీజ్ చేయడమే కాకుండా.. ఔషధాలకు సంబంధించిన నమూనాలను కూడా సేకరించారు. ఈ దాడుల్లో కుత్బుల్లాపూర్ డీసీఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.విజయ్ గోపాల్, జీడిమెట్ల డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎ.సరిత, కుత్బుల్లాపూర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇ. తిరుపతి తదితరులు పాల్గొన్నారు.